దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం ఒకటి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఈ దేశం అల్లాడుతోంది. దేశ సరిహద్దుల వెంట నిత్యం ఏదో ఒక సంఘర్షణ ఎదరవుతూనే ఉంది. దీనికి ప్రధానంగా దాయాది దేశమైన పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న సవాళ్లు, ప్రతిసవాళ్లే కారణమనే విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశం పెంచి పోషించిన ఉగ్రవాదం ఇప్పుడు మరింతగా భారత్ను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఎప్పటికప్పుడు ఉగ్ర బాధిత దేశంలో భారత్ మిగిలిపోరాదనే పాలకుల ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నా.. పాకిస్థాన్కు గట్టిగా బుద్ది చెప్పడంలో మాత్రం భారత్ వెనుకబడి పోతోంది.
ఉదాహరణకు అణ్వాయుధ తయారీపై పాక్ను నిలువరించాలని భారత్ ప్రయత్నించినా.. ఫలితం కనిపించలేదు. ఐక్య రాజ్యసమితిలో ఇప్పటికే భారత్ తన వాదనను వినిపిస్తోంది. అయితే, చైనా అండగా నిలవడంతో పాకిస్తాన్ రెచ్చిపోతోంది. ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక కూడా అనేక వివాదాలు, ఘర్షణలు, సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. అయితే, వీటిని తిప్పికొట్టడంలో మోడీ తీసుకున్న సర్జికల్ స్ట్రైక్స్ వంటి నిర్ణయాలు కొంతమేరకు ఫలించాయి. ఇదే సమయంలో, ప్రధానంగా ఉగ్రవాదం విషయంలో మాత్రం పాక్ నిలువరించే ప్రయత్నాలను కూడా మోడీ వ్యూహాత్మకంగా ముందుకు తీసుకు వెళ్లారు.
ఉగ్రవాదులకు అండగా నిలవడమే కాకుండా.. ఉగ్రసమూహాలకు నిధులు కేటాయిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించిన భారత్.. పాక్కు కొర్రుకాల్చి వాతపెట్టిన చందంగా అంతర్జాతీయంగా నిధులు నిలిచిపోయే పరిస్థితిని తీసుకువచ్చింది. ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్(ఐఎంఎఫ్) నుంచ పాకిస్థాన్కు నిధులు కట్టడిచేయడం ద్వారా పాక్ను ముప్పుతిప్పులుపెట్టాలని భావించిన మోడీ ఇదే వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. నిజానికి భారత్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అతిపెద్ద క్రతువైన ఎన్నికల్లో పడి ఈ విషయాన్ని పక్కన పెడతారని అందరూ భావించారు. కానీ, మోడీ మాత్రం తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు.
ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్కు ఐఎంఎఫ్ నుంచి నిధులు అందకుండా కట్టడి చేసేక్రమంలో లాబీయింగ్ను ఉపయోగించారు. దీనిలో భాగంగా భారత్ వాదనను విన్న ఐఎంఎఫ్.. పాక్ను నిలువరించే ప్రయత్నం చేసింది. తన వాదన చెప్పుకొనేందుకు, నిధులు రాబట్టేందుకు పాక్ చేసిన ప్రయత్నాలు ఐఎంఎప్ నిలువరించింది. కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా పాక్కు తగిన విధంగా బుద్ది చెప్పింది. దీంతో ఇప్పుడు పాక్లో ద్రవ్యోల్బణం గతంలో ఎన్నడూలేని విధంగా 9.2% చేరింది. నిధులు లేక ఇప్పటికే ప్రధానికి సంబంధించిన పాత వాహనాలను వేలం వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే, భారత్ చేస్తున్న ప్రయత్నాలు, ముఖ్యంగా మోడీ వ్యూహం మరింతగా రాటు దేలితే.. పాక్ కు బుద్ధి రావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.