ఏపీ సీఎం చంద్రబాబుకు అదిరిపోయే షాక్ తగిలింది. తాజా ఎన్నికల్లో బాబు వ్యూహాలు ఏమేరకు ఫలించాయి? ఆయన గెలుపు గుర్రం ఎక్కుతాడా? పార్టీని అధికారంలోకి తీసుకువస్తాడా? అనే చర్చ జోరుగా సాగుతున్న సమయంలో సొంత పార్టీ నేతలు వెల్లడిస్తున్న సంచలన విషయాలు బాబు సీనియార్టీని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. దేశ రాజకీయాల్లో తానే సీనియర్నని పదే పదే వెల్లడించే చంద్రబాబు.. తన కన్నా ఉత్తమ పాలకుడు లేడని కూడా చెప్పుకొంటారు. అయితే, తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన వ్యూహాలు, పాలనా దక్షత ఏమేరకు ఫలించాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ముఖ్యంగా తాను అపరభగీరథుడినని చెప్పుకొనే చంద్రబాబు నదుల అనుసంధానం చేశారు.
పోలవరం ప్రాజెక్టును నిర్మించేందుకు ఎంతో శ్రమించారు. సోమవారాన్ని పోలవారం చేసుకుని మరీ ఎన్నికల్లో ప్రయోజ నం పొందేందుకు రైతులను తన పక్షాన నిలుపుకొనేందుకు బాబు ప్రయత్నించారు. ఇక, దాదాపు 120 రకాల ప్రయోజనా లను సంక్షేమం రూపంలోనూ ఆయన అందించారు. అయితే వీటిలో ఎన్ని విజయవంతం అయ్యాయి? ఎన్నిబాబుకు పేరు తెచ్చాయి? ముఖ్యంగా ఎన్నికల్లో బాబుకు ఎన్ని పథకాలు ఓట్లేసేలా చేశాయి? అనే ప్రశ్న తెరమీదికి వచ్చినప్పుడు నిల్ అనే మాటే వినిపిస్తుండడం గమనార్హం. అంటే ఈ పథకాలు ఏవీ కూడా ఆయనకు ప్రయోజనం చేకూర్చలేదు. కేవలం ఎన్నికలకు రెండు వారాల ముందు తీసుకున్న నిర్ణయం అది కూడా మహిళలను ఆకట్టుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం మాత్రమే ఫలించింది.
పసుపు-కుంకుమ రూపంలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఇచ్చిన రూ.10 వేలు, ఇక, వృద్ధాప్య పింఛన్ను రెండు వేలకు పెంచిన తీరు మాత్రమే ఓట్ల రూపంలో చంద్రబాబుకు మేలు చేసిందనేది వాస్తవం. అంటే, నాలుగున్నరేళ్ల కాలం లో చంద్రబాబు చేసిన ధర్మ పోరాటాలు, ప్రాజెక్టుల కోసం పడ్డ ఆరాటాలు వంటివి ఏవీ కూడా చంద్రబాబుకు ఫలితం ఇవ్వకపోవడం గమనార్హం. అంటే, నలభై ఏళ్ల సీనియార్టీ కూడా వృథా అయ్యిందనే వాదన బలంగా వినిపిం చింది.కేంద్రంతో ప్రత్యేక హోదా విషయంలో ఆయన పడిన పోరుకూడా పక్కకు పోయి.. కేవలం పసుపు-కుంకుమ పైనే టీడీపీ ఆధారపడిన విషయం గమనార్హం. ఇదే విషయాన్ని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేస్తూ.. పార్టీ తీరును ఆయన తన దైన శైలిలో ఎండగట్టడం విశేషం.