ఫార్టీ ఇయర్స్ అనుభవం.. రాష్ట్రాన్ని నాకించేసిందా? ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందా? ప్రస్తుతం ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికలు ముగిసి రెండు వారాలు అవుతున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం కోడ్ను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ప్రధాన పరిపాలన అంతా కూడా ఎన్నికల సంఘం నేతృత్వంలోనే సాగుతోంది. అయితే, గడిచిన నాలుగేళ్లలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రాష్ట్రంలో ప్రజల నుంచి సేకరించిన పన్నుల ద్వారా వచ్చిన నిధులతో కనీస నిల్వలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది ఏ రాష్ట్రంలో అయినా జరిగేదే. ఎక్కడైనా రాష్ట్రంలో అనివార్య పరిస్థితి తలెత్తినప్పుడు వినియోగించుకునేందుకు వీలుగా కన్సాలిడేటెడ్ ఫండ్ను నిల్వ చేస్తారు. కానీ, ఏపీని గడిచిన ఐదేళ్లుగా పాలించిన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు మాత్రం నాకించేశారు. ఖజానాను తన దుబారా కర్చుల కోసం ఖాళీ చేసేశారు.
చంద్రబాబు నిర్వాకం కారణంగా.. ఖజానా మొత్తం ఊడ్చి పెట్టుకుపోయింది. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యంగా ఎన్నికలకు రెండు మాసాల ముందు వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ప్రజల సొమ్మును చంద్రబాబు చేతికి ఎముకల లేకుండా, కనీసం రాష్ట్ర పరిస్థితిని అంచనా వేసుకోకుండానే ఆయన దుబారా చేసేశారు. ధర్మ పోరాటాలు, నవనిర్మాణ దీక్షల పేరుతో నిరర్ధక వ్యయం భారీ ఎత్తున చేసేశారని అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా కూడా ఇలాంటి విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండానే చంద్రబాబు ప్రజాధనాన్ని మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు చేసేశారు. ఇక, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిసినా కూడా ఆయన తన మందీ మార్బలంతో ప్రజాధనం ఖర్చు చేసి ఢిల్లీ వెళ్లిమరీ ఉద్యమాలు చేసి ఖజానాకు సున్నం కొట్టారు. ఇక, పసుపు-కుంకుమ పేరుతో అధికారికంగానే ఓట్లను కొనేందుకు సిద్ధపడి ప్రజాధనాన్ని పప్పుబెల్లాల మాదిరిగా తన స్వార్ధానికి వినియోగించారు.
ఇక, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే.. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితిలో కూడా రాష్ట్రం లేక పోవడం గమనార్హం. తాజాగా ప్రధాన పరిపాలన అంతా కూడా ఎన్నికల సంఘం కనుసన్నల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో సాగుతోంది. నూతనంగా ఆదాయం పెంచుకునే అవకాశం లేదు. ఉన్న వనరులనే సర్దు బాటు చేయాలి. తాజాగా వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్లర్లు తమకు రావాల్సిన సొమ్ము చెల్లించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీనిలో మొత్తం 35 వేల కోట్ల రూపాయల బిల్లులు ఉన్నాయి. అయితే, వీటిలో 22 వేల కోట్ల మేరకు బిల్లులు చెల్లించలేమంటూ ప్రభుత్వం వెనక్కి పంపేసింది. దీంతో కాంట్రాక్టర్లు లబోదిబో మనే పరిస్థితితో పాటు.. ఆయా పనులు కూడా ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, ఈ పనులపైనే ఆధారపడి జీవిస్తున్న పేద వర్గాల కడుపు కాలడం కూడా ఖాయమని అంటున్నారు. మొత్తానికి బాబు తన ఫార్టీ ఇయర్స్ అనుభవంతో ఏపీని నాకించేశారని అంటున్నారు ప్రభుత్వ అధికారులు.