చోడవరం. విశాఖజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ నుంచి వరుసగా టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే 2004లో ఇక్కడ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. ఇక, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేసిన కె. నాగసన్యాసి రాజు విజయం సాదించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న రాజు.. హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే, ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో చోడవరం నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుగాలులు జోరుగా వీస్తున్నాయి. ఇక, ఇక్కడ నుంచి వైసీపీ తరఫున కరణం ధర్మశ్రీ, జనసేన తరఫున పీవీఎస్ ఎన్ రాజు పోటీకి దిగారు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఉన్నప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేక పోయారు. అయితే, ప్రధాన పోరు మాత్రం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యే జరిగింది. ఇక, కాపు వర్గం ఎక్కువగా ఉండడంతో వీరు వేసే ఓట్లే కీలకం కానున్నాయి. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు కాపు రిజర్వేషన్ సహా కాపు వర్గానికి చెందిన నాయకుడు ముద్రగడ పద్మనాభంను అవమానించారనే ప్రచారం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కాపులకు టీడీపీకి యాంటీ అయ్యారని తెలుస్తోంది. ఇక, గత మూడు సార్లు కూడా ఇక్కడ నుంచి గెలిచిన టీడీపీ ఆపశోపాలు పడింది. గంటా కేవలం 2004లో 9 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక, 2009తో ఇక్కడ నుంచి బరిలోకి దిగిన సన్యాసి రాజు.. 1300 ఓట్ల సాధారణ మెజారిటీతో గట్టెక్కారు.
ఇక, ప్రధానంగా 2014లో జరిగిన ఎన్నికల్లో 612 ఓట్ల మెజారిటీతో సన్యాసి రాజు విజయం సాధించారు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజు అతి స్వల్ప మెజార్టీతోనే గెలిచారు. ఇక ఈ సీటును ఈ ఎన్నికల్లో టీడీపీకే ఇవ్వాలని ఆ పార్టీ స్థానిక నాయకులు గట్టిగా పట్టుబట్టారు. అయితే చివరకు చంద్రబాబు మాత్రం రాజు వైపే మొగ్గు చూపారు. ఇక కాపుల్లో స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతకు తోడు గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేన ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తుండడంతో ఆ వర్గం ఓట్లు టీడీపీకి మైనస్ కానున్నాయి. ఈ నేపథ్యంలో రాజు గెలుపు అంత ఈజీకాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మరోపక్క, రెండు సార్లు ఓటమి చవిచూసిన కరణం ధర్మశ్రీ పట్ల సానుభూతి సహా కాపు వర్గం కూడా అండగా ఉండడం కలిసి వస్తోంది. ఇక, జగన్ హామీలు, వైసీపీ హవా, మార్పు వంటివి కూడా చోడవరంలో జోరుగా పనిచేసింది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే.. విశాఖలో టీడీపీ అంచనా వేస్తున్న సీట్లలో చోడవరం ఉన్నప్పటికీ.. ఎన్నికల ఫలితాలపై వెలువడుతున్న అంచనాలు మాత్రం టీడీపీ ఆశలను ఆవిరి చేస్తోంది. సన్యాసి రాజు హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు జల్లుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే.