పాపమంతా బోర్డుదే..తోడైనా గ్లోబరీనా గోల్మాల్, ఏకపక్ష నిర్ణయాలతో గందరగోళం.. త్రిసభ్య కమిటీ విచారణ, నేడు సర్కార్కు నివేదిక. ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండడంతో ముగుస్తున్న రీ వాల్యు యేషన్, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ గడువును పెంచింది. ఈ నెల 27 వరకు పెంచింది. వీటన్నింటికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు ఇంటర్ ఫలితాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీ ఇంటర్బోర్డు అధికారులతో భేటీ అయ్యారు. ఫలితాల్లో ఇంత భారీ ఎత్తున అవకతవకలు ఎలా జరిగాయనే దానిపై అన్ని కోణాల్లో త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది.
మరోవైపు ఇదే అంశంపై హైకోర్టులో కూడా విచారణ స్టార్ట్ అయ్యింది. ఫలితాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాల్సిందిగా బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది ధర్మాసనం. విచారణకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి, ఇంటర్బోర్డు సెక్రటరీ అశోక్కుమార్ హాజరయ్యారు. హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ను వెంటనే సస్పెండ్ చేశాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ ఇంటర్ బోర్డు ఆఫీసు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థుల ఆందోళనలతో ఇంటర్ పరిసరాలు అట్టుడికాయి. నిన్న కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు వద్ద కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను, తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా వివిధ పోలీస్స్టేషన్లకు తరలిస్తుండటంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు విద్యార్థులకు మద్దతుగా వచ్చిన వివిధ విద్యార్థి సంఘం నేతలను, రాజకీయ పార్టీ కార్యకర్తలను బలవంతంగా తరలించారు.
ఇక ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఇంటర్ బోర్డు వ్యవహరిస్తున్న తిరుపై తల్లిదండ్రులు, విద్యార్థులు మండిపడుతున్నారు. మార్కుల అవకతవకలపై ఇంత గందరగోళం జరుగుతున్నాయ.. ఇప్పటివరకు అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డగోలుగా రివాల్యుయేషన్ చేసి తమ జీవితాలతో చెలగాటం ఆడుగుతన్నారని మండిపడుతున్నారు. ఒక్కో పేపర్కి 6 వందల రూపాయలు తీసుకుంటూ లక్షలు సంపాధిస్తున్నారని బోర్డు తీరును ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రీవాల్యుయేషన్ను ఉచితంగా జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదంతా కష్టపడి చదివి పరీక్ష రాస్తే.. కేవలం 10 నిమిషాల్లోనే తమ పిల్లల భవిష్యత్ను డిసైడ్ చేస్తున్నారని ఇంటర్ బోర్డు తీరుపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు కాలేజీలు, కోచింగ్కు కట్టి తమ పిల్లల్ని చదివిస్తే ఇంటర్బోర్డు మాత్రం టేకిట్ ఈజీగా తీసుకుంటుందని మండిపడుతున్నారు. 16 మంది విద్యార్థల జీవితాలను ఇంటర్ బోర్డు తిరిగి ఇవ్వగలదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇక ఇంటర్ ఫలితాలపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని అందరూ సంయమనం పాటించాలని సూచించారు. ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయని అన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి.
ఇంటర్ బోర్డు దగ్గరకు వచ్చిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ నాగేశ్వర్ ను పోలీసులు బలవంతంగా పోలీస్స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై నాగేశ్వర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ మండిపడ్డారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే 16 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ ఘటనతో ఇంటర్ బోర్డు డొల్లతనం బయటపడిందని నాగటి నారాయణ చెప్పారు.
మరోవైపు ఇంటర్ ఫలితాలపై తమపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు గ్లొబరీనా సంస్థ సీఈవో విఎస్ఎన్ రాజు. ఈ రంగంలో తమకు 18 ఏళ్ల అనుభవం ఉందని.. రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు గ్లోబరీనా సీఈవో రాజు.
సంతృప్తికరంగా సేవలందించకపోతేనే తాము గ్లోబరీనా సంస్థను పక్కన పెట్టామన్నారు కాకినాడ జేఎన్టీయూ రిజిస్ట్రార్ సుబ్బారావు. ఇదే అంశంపై గ్లోబరీనా సంస్థ కోర్టుకు వెళ్లిందని.. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆ సంస్థ వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్య్తం చేశారు సుబ్బారావు.
ఇంటర్ పలితాల్లో అవకతవకలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు. మార్కుల్లో అనుమానం ఉన్న విద్యార్థులంతా రీ వాల్యుయేషన్కు దరఖాస్తు వేసుకోవాలని సూచించారాయన.