చామకూర మల్లారెడ్డి...తెలంగాణ మంత్రి. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన స్వల్పకాలంలోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేత. అలాంటి కీలకమైన వ్యక్తి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? అలా వ్యవహరించకపోవడం వల్ల నవ్వులపాలవడమే కాకుండా...వివాదాస్పదం కూడా అయ్యారు. కీలక అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ లెటర్ హెడ్ ను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ కొత్త చర్చకు తెరలేపారు.
కీసర మండల టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడిగా జలపురం సుధాకర్ రెడ్డిని నియమిస్తూ అపాయింట్ మెంట్ లెటర్ జారీ చేశారు. అయితే, పార్టీ లెటర్ హెడ్ పై ఇవ్వాల్సిన అపాయింట్ మెంట్ లెటర్ కాస్త ప్రభుత్వ లెటర్ హెడ్ పై ఇచ్చారు. ఇంకేముంది మంత్రిగారి చర్య సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి వాడాల్సిన లెటర్ హెడ్ ను పార్టీ వ్యవహారాలకు వినియోగించడం ఏంటని పలువురు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మంత్రిత్వ శాఖకు చెందిన లెటర్ హెడ్ ఎందుకోసం ఉపయోగించాలో కూడా తెలియదా అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా మల్లారెడ్డి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు.