ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు రంగంలోకి దిగారు. ఇంటర్మీడియట్ బోర్డుపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతుండటం...బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్, పేరంట్స్ భారీ ఎత్తున ఆందోళనకు దిగుతున్న తరుణంలో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్లో తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.
ఫలితాల విషయంలో జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఎలాంటి రుసుం లేకుండా విద్యార్థులకు ఉచితంగా రీ వ్యాల్యూయేషన్ సదుపాయం కల్పించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు. అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఎలా అప్పగించారు? అర్హతల్లేని ప్రైవేటు సంస్థకు టెండర్ను కట్టబెట్టడంలో ఆంతర్యమేంటనేది బోర్డు స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్లతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమవేశంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.