కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి ఇప్పటికే రెండు సార్లు విజయం సాదించిన సీనియర్ పొలిటీషియన్, వైసీపీ నేత, గడికోట శ్రీకాంతరెడ్డిపై అంచనాలు పెరుగుతున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై ఇక్కడ నుంచి విజయం సాధించిన శ్రీకాంత్ రెడ్డి, తర్వాత జరిగిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో వైసీపీకి జై కొట్టాడు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 2012లో వైసీపీ టికెట్పై విజయం సాదించారు. ఇక, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైసీపీ తర ఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇలా.. నియోజకవర్గంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న శ్రీకాంతరెడ్డి.. పార్టీలోనూ కీలకంగా మారారు.
వైసీపీలో అత్యంత కీలకమైన తొలి 10 మంది నాయకుల్లో ఒకరిగా గుర్తింపు సాధించారు. అవసరమైన ప్రతిసారీ పార్టీ తరఫున గట్టి గళం వినిపించడంలోనూ శ్రీకాంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. జగన్ దగ్గర నేరుగా యాక్సస్ ఉన్న నాయకుల్లో శ్రీకాంత్ కూడా ఒకరు. ప్రభుత్వ పక్షంగా ఉన్న టీడీపీని విమర్శించడంలోనూ తనదైన శైలిలో ఏకేయడం కూడా శ్రీకాంత్ రెడ్డి సొంతం. తాను ఉన్నది, గెలిచింది కూడాకడప జిల్లానే అయినా.. అత్యంత సౌమ్యుడిగా, అవినీతి లేని నాయకుడుగా శ్రీకాంత్ గుర్తింపు పొందారు. ఇక, తాజగా ముగిసిన ఎన్నికలలో రాయచోటి నుంచి మరోసారి శ్రీకాంత్ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేశారు.
ఇక, టీడీపీ నుంచి గత ఎన్నికల్లో ఓటమిపాలైన రెడ్డపగారి రమేష్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. జనసేన, కాంగ్రెస్ల నుంచి ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్యే జరగనుంది. హోరా హోరీగా సాగిన ఎన్నికల పోరులో ప్రధానంగా ప్రజలు శ్రీకాంత్రెడ్డి వైపే మొగ్గు చూపారని అంటున్నారు. ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరిస్తూ.. ప్రజల్లో ఒకడిగా మసలడంతోపాటు అభివృద్ధికి కూడా కారణంగా నిలిచాడు. ప్రతి ఒక్క సమస్యను ఓపికగా వినడం, వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడం శ్రీకాంత్కు ప్లస్గా మారింది.
తాజాగా ముగిసిన ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనే బలమైన వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో రాయచో టిలో శ్రీకాంత్ రెడ్డి గెలిస్తే.. ఖచ్చితంగా జగన్ కేబినెట్లో ఆయనకు బెర్త్ ఖాయమనే వ్యాఖ్యలుకూడా వినిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వివాద రహితుడుగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్.. జగన్కు కూడా ఆప్తుడు కావడం గమనార్హం.