తెలుగుదేశం పార్టీ కాలకేయుడు అంటే ఏపీలో చాలా మందికి తెలియకపోయినా... ఆ పార్టీ కాంట్రవర్సీ కింగ్గా పేరు తెచ్చుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేరు చెబితే తెలియని వారు ఉండరు. రోజుకో వివాదంతో ఇష్టం వచ్చినట్టు ఎవరిపై పడితే వారిపై చేయి చేసుకుంటూ వివాదాలతో వార్తల్లో నిలిచేందుకే ఇష్టపడే చింతమనేనిని చాలా మంది బాహుబలి సినిమాలో విలన్ అయిన కాలకేయుడితో పోలుస్తూ టిడిపి కాలకేయుడుగా పేరు పెట్టారు. చింతమనేని సొంత నియోజకవర్గం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో స్థానికంగా ఉన్న పరిస్థితులను ఉపయోగించుకుని గత రెండు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తూ వస్తున్నా, ఈ సారి ఓటమి తప్పదని చర్చలు కూడా దెందులూరు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల నియోజకవర్గంలో చర్చకు వస్తున్నాయి. ఏపీలో ఉన్న చాలా హాట్ సీట్లలో దెందులూరు కూడా ఒకటి. చాలామంది చూపు ఇక్కడ ఉంది.
ఇక్కడ టీడీపీ నుంచి వరుసగా మూడోసారి పోటీలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఈసారి గెలుస్తారా ? హ్యాట్రిక్ కొడతారా ? లేదా తొలిసారి ఓటమి రుచి చూస్తారా ? అన్నది ఉత్కంఠగానే ఉంది. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉండి హైలెట్ అయ్యేందుకు ఇష్టపడే చింతమనేని టిడిపి అధికారంలోకి వచ్చి పదవి వచ్చాక మరింతగా రెచ్చిపోయారు. ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత కొనితెచ్చుకున్నారు. రెండోసారి దెందులూరు ఎమ్మెల్యేగా చింతమనేని గెలిచాక నియోజకవర్గంలో ఆయన చర్యలు తారాస్థాయికి చేరుకున్నాయి. చివరకు ఓ మహిళ ఎమ్మార్వోపై చింతమనేని దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయనకు చంద్రబాబు చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి సరిపెట్టడం చింతమనేనిపై ఆయనకు ఉన్న అపార ప్రేమ చాటిచెప్పింది. చాలా సార్లు చంద్రబాబు చింతమనేని అక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండటం, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నడంతో చింతమనేని తనను అడిగే వాడు లేడని రెచ్చిపోతూ వచ్చారు.
పోలవరం కాలువ దెందులూరు నియోజకవర్గం వెంటే వెళ్తుంది. దెందులూరు నియోజకవర్గంలో పోలవరం కాలవ గట్టు మీద మట్టి మనకు ఎక్కడా కనపడదు. ఆ మట్టిని నమ్ముకున్న చింతమనేని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులపై ఆయన దాడులకు లెక్కేలేదు. అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరు ఆయన బాధితులే. ఈ పరిణామాలన్నీ తాజా ఎన్నికల వేళ దెందులూరులో చింతమనేని ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి అంటే అవుననే చెబుతోంది. ఈ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో 84-70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే దెందులూరు నియోజకవర్గంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
మామూలుగా పోలింగ్ ముగిసిన వెంటనే చింతమనేని బయటకు వచ్చి చేసే హడావుడికి అంతే ఉండదు. అయితే ఈసారి పోలింగ్ సరళిని బట్టి ఓ అంచనాకు వచ్చిన చింతమనేని తనకు చాలా గట్టి పోటీ ఎదురైందని గెలుపుపై సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దెందులూరులో ఈ సారి చింతమనేనికి గట్టి పోటీ ఎదురయ్యేందుకు అనేక కారణాలు ఉన్నాయి. చింతమనేని సామాజిక వర్గానికి చెందిన కోఠారు అబ్బయ్య చౌదరి వైసీపీ నుంచి బరిలో ఉండటం, ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉండటం ఎన్నికల్లో ప్లస్ కానుంది. కొఠారు అబ్బయ్య చౌదరి చింతమనేనికి సమీప బంధువు కూడా. రెండు సంవత్సరాల క్రితం వరకు లండన్లో సాఫ్ట్వేర్ నిపుణుడిగా ఉన్న అబ్బయ్య చౌదరి తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అంతకుముందు వైసిపి యూరప్, యూకే కన్వీనర్గా అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేశారు. రెండేళ్లుగా అబ్బయ్య చౌదరి చింతమనేని అక్రమాలపై తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. గడపగడపకు వైఎస్ఆర్, రావాలి జగన్ కావాలి జగన్ వంటి కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు.
అదే టైంలో చింతమనేని తీరుతో తీవ్రంగా విసిగిపోయిన ఆయన సొంత సామాజిక వర్గం నుంచి కూడా చింతమనేని కంటే కొఠారుకే ఎక్కువ మద్దతు ఇచ్చింది. కమ్మ సామాజికవర్గం అంటే సహజంగానే ఎక్కువగా టిడిపికి మద్దతు ఇస్తుంది. అయితే ఈ సారి దెందులూరు నియోజకవర్గంలో ప్రభాకర్ తీరుతో విసిగి పోయిన వాళ్లంతా అబ్బయ్య చౌదరికే జై కొట్టారు. బీసీలు బలంగా ఉన్న గౌడ, కొల్లేరులో ఎక్కువగా ఉన్న వడ్డీ సామాజిక వర్గం చింతమనేని వేధింపులతో విసిగిపోయింది. వీరంతా ఇప్పుడు వన్ సైడ్గా వైసిపికి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత చింతమనేని సైతం తన అనుచరులతో తన గెలుపుపై భారీగా పందాలు కాయవద్దని చెప్పడాన్ని బట్టి చూస్తే గెలుపు విషయంలో ఆయనే డోలాయమానంలో ఉన్నట్టు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఇక చింతమనేని వీరాభిమానులు సైతం ఈ సారి తమ నాయకుడు గెలుపు సులువు కాదని ఓపెన్గానే చెబుతున్నారు. ఏదేమైనా దెందులూరులో ఈసారి సమీకరణలు వైసిపి కి అనుకూలంగా ఉన్నాయి. మరి ఈ ఫలితాల్లో దెందులూరు ఓటరు ఎవరిని అందలం ఎక్కిస్తారో ? చూడాల్సి ఉంది.