చంద్రబాబుకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యిందని చెప్పక తప్పదు. ఒక పక్కేమో ఎన్నికల్లో గెలుస్తామన్న ధీమా లేదు. అధికారం చేజారితే పరిస్థితి ఏంటని ఇప్పుడు  టీడీపీలో నడుస్తున్న చర్చ. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళితే... చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని - దీనిపై విచారణ చేపట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని టీడీపీ వ్యవస్థాపకుడు - దివంగత సీఎం ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసు విచారణ సాగకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు స్టే తెచ్చుకున్నారు.


హైకోర్టు స్టే కారణంగా ఏసీబీ కోర్టు ఈ కేసు విచారణను నిలిపివేసింది. తాజాగా సుదీర్ఘ కాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలే సంచలన తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై దాఖలైన పిటిషన్ విచారణపై కొనసాగుతున్న స్టే కూడా రద్దైపోయింది.ఈ క్రమంలో కాస్తంత వేగంగానే స్పందించిన ఏసీబీ కోర్టు... ఈ కేసు విచారణకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను తీసుకున్న లక్ష్మీపార్వతి కాసేపటి క్రితం విచారణకు హాజరయ్యారు.


దీంతో ఈ కేసులో ఏసీబీ విచారణ ప్రారంభమైపోయిందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ కేసు స్టేటస్ పై వచ్చే నెల 13న విచారిస్తామని కూడా ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది. మొత్తంగా తనపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరగకుండా చంద్రబాబు తెచ్చుకున్న ఈ స్టే రద్దు కావడంతో ఇకపై ఈ కేసులో విచారణ వేగవంతం కానుందని - చంద్రబాబుకు ఈ కేసులో ఇబ్బంది తప్పదన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: