పెద్ద వాళ్ల ఇళ్లల్లో జరిగే ఆసక్తికర రాజకీయాలకు ఉదాహరణ ఇది. ఎన్నికల సందర్భంలో జరిగే అనేకానేక చిత్రాలకు తార్కాణం. రాజకీయాలు బడా బాబుల కుటుంబాల్లో కూడా ఎన్నో కీలక పరిణామాలకు వేదికగా నిలుస్తుందనేందుకు తాజాగా భారతీయ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట చోటుచేసుకుంటున్న సంఘటనలే మచ్చుతునక అంటున్నారు. వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ కాంగ్రెస్కు మద్దతిస్తుంటే....ఆయన తనయుడు అనంత్ అంబానీ బీజేపీకి మద్దతుగా నడుచుకుంటున్నారు.
దక్షిణ ముంబై నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన మిలింద్ దేవరాకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ మద్దతు పలికారు. తన గెలుపు గురించి వివరిస్తూ దేవరా ఒక వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు అంతా దక్షిణ ముంబైకి మిలింద్ దేవరా ఒక్కడే అత్యుత్తమ అభ్యర్థి అని పేర్కొన్నారు.ఇందులో ముకేష్ దేవరాకు మద్దతిచ్చారు. మిలింద్ దేవరా ట్వీట్ చేసిన వీడియోలో కోటక్ మహీంద్ర గ్రూప్ యజమాని ఉదయ్ కోటక్ తమ మద్దతు ప్రకటించారు.
ఇదిలాఉండగా,ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ హాజరయ్యారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు అంబానీ కుటుంబం అనంత్ అంబానీ చర్చనీయాంశంగా మారింది.
ముకేష్ అంబానీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించగా....ఆయన తనయుడు అనంత్ అంబానీ మోదీకి మద్దతుగా సభలో పాల్గొనడం సంచలనంగా మారింది. అంబానీ ఇంట ఎన్నికలు చీలికను తీసుకువచ్చాయా అని పలువురు చర్చించుకుంటున్నారు. రాజకీయాల్లో, వ్యాపారాల్లో ఇవన్నీ సహజమైనవేనని ఇంకొందరు చెప్తున్నారు.