తెలంగాణలో వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. ముక్కుపచ్చలారని పసిపిల్లను కూడా ఈ మురికి కూపంలోకి లాగేస్తున్నారు. ఐదో తరగతి చదివే బాలికలను కూడా ఈ దారుణ రొంపిలోకి తీసుకొస్తున్నారు. తాజాగా ఐదుగురు బాలికలను వ్యభిచార కూపంలోకి దింపే యత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 


ఈ దారుణం జగిత్యాల జిల్లా ధర్మపురంలో జరుగుతోంది. పోలీసుల విచారణలో అనేక విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ధర్మపురి పట్టణంలోని దుర్గా కాలనీలో చాలా ఏళ్లుగా వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి బాలికలను కొనుగోలు చేసి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్నారట.

ఇలా బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న బాలికల్లో.. 7 నుంచి 13 ఏళ్ల వయసు గల విద్యార్థినులే ఉన్నారట. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 5, 6, 8వ తరగతులు చదువుతున్న విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారట. వీరిని చిన్న వయసులోనే కొనుగోలు చేసి బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. 

కరీంనగర్‌కు చెందిన ఇంటర్‌ చదువుతున్న 17 ఏళ్ల అమ్మాయిని రూ.10 వేలకు కొనుగోలు చేసినట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. బాధిత బాలికలను కరీంనగర్‌లోని బాలికల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఆడపిల్లలను వదిలించుకుందామనో.. డబ్బుకు కక్కుర్తి పడో తల్లిదండ్రులు కూడా వీరికి సహకరిస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: