ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తన ఐదేళ్ల కాలం పరిపాలనకు ఎలాంటి సమాధానం ఇచ్చుకోవాలో తెలియని స్థితికి చేరిపోయారని అంటున్నారు. ఇందుకు తార్కాణంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి కానీ...తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కానీ స్పందన రాకపోవడాన్ని ఉదహరిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో సినిమా విడుదలను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంది. కోర్టులకు వెళ్లింది. అయితే, తాజాగా ఎట్టకేలకు ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సినిమా కార్యక్రమాలకు సంబంధించి వర్మ ఏపీకి వస్తుండగా ఎయిర్పోర్టులో పోలీసులు అడ్డుకున్న విషయం విదితమే. ఆదివారం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలపై విజయవాడ ఎయిర్పోర్టులో డైరెక్టర్ రామ్గోపాల్ వర్మను అరెస్టు చేయడం, పోలీసులు మోహరించడం వంటి పరిణామాలపై వైఎస్ జగన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.
``విజయవాడలో ఓ సినిమా యూనిట్ వచ్చి ప్రెస్మీట్ పెట్టుకునే వీలులేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతుల కంటే హీనంగా వాడుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇదేనా మన ప్రజాస్వామ్యం..? చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?`` అని జగన్ ప్రశ్నించారు. జగన్ వేసిన ప్రశ్నకు టీడీపీ నేతల నుంచి కానీ...చంద్రబాబు నుంచి కానీ స్పందన లేకపోవడం గమనార్హం.