ఏపీలో హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు, తెలుగుదేశం పార్టీ గెలుపుపై నీలినీడలు కమ్ముకున్న తరుణంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఈసీపై గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 8వ తేదీ వరకు తనకు ముఖ్యమంత్రిగా బాధ్కయతలు నిర్వర్తించే అవకాశం, అధికారం ఉందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, నిబంధనల మేరకు సమీక్షలకు నో చెప్పడంతో....చంద్రబాబు విహార యాత్రకు వెళ్లారు.
పోలింగ్ అనంతరం విశ్రాంతి కోసం కొద్దిరోజుల క్రితం చంద్రబాబు తాజాగా అమరావతికి తిరిగొచ్చారు. సతీసమేతంగా చంద్రబాబు దంపతులు సిమ్లా నుంచి సోమవారం తిరిగివచ్చారు. రాగానే చంద్రబాబు తదుపరి పనులపై దృష్టి సారించారు. మే రెండో తేదీ నుంచి టీడీపీ సమీక్షలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలకు చంద్రబాబు తెలిపారు. ఇందులో టీడీపీ గెలుపు ఓటములపై ఆయన అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా, చాలామంది తెలుగుదేశం పార్టీ సీనియర్లు గెలుపుపై పూర్తి విశ్వాసంతో లేరు. ఇటీవల జరిగిన సమీక్షలోనూ ఇదే మాటను సదరు నాయకులు చెప్పారు. తిరిగి నిర్వహించబోయే సమీక్షలో ఏం కారణం చెప్పాలా అని కొందరు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకే అంశంపై ఎన్నిసార్లు సమీక్ష అంటూ మరికొందరు వాపోతున్నట్లుగా సమాచారం.