ఎన్నికలు జరుగుతున్న క్రమంలో గొడవలు సృష్టించాలని చూసిన టిడిపి త్వరలో జరగబోతున్న కౌంటింగ్ ఏర్పాట్ల విషయంలో కూడా అదేవిధంగా గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి. అందువల్ల కౌంటింగ్ సెంటర్ల వద్ద కేంద్ర బలగాలను నియమించాలని కోరుతూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు.
అధికార పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు నకిలీ ఫారం 17 తీసుకువచ్చే అవకాశం ఉందని, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఈసీ ప్రకటించాలని అన్నారు. కౌంటింగ్ జరిగే వరకూ ఎన్నికల పరిశీలకులు కౌంటింగ్ హాల్లోనే ఉండాలని, లేనిపక్షంలో రిటర్నింగ్ అధికారులపై అధికార పార్టీ ఏజెంట్లు ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
కౌంటింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియను ముందుగానే పూర్తిచేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లకు ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టించి ఆలస్యం చేసే కుట్రపన్నుతున్నారని ఈసీకి నివేదించారు. ఈవీఎంల వద్ద మెష్తో పాటు స్టీల్ బారికేడ్లు కూడా ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.