మహిళల భద్రతపై మరోమారు సందేహాలు నెలకొంటున్నాయి. మానవ మృగాల ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. సమాజంలో అబలలపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో...తాజాగా ఓ కానిస్టేబుల్ దారుణమైన స్థితిలో కన్నుమూసింది. ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు ఓ వ్యక్తి. సదరు వ్యక్తి సైతం కానిస్టేబుల్ కావడం కలకలం రేకెత్తిస్తోంది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండం కోనాపూర్లో ఈ దారుణం జరిగింది. ప్రకాష్ అనే వ్యక్తి హత్నూర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. రామచంద్రాపురం పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న మందాకినితో ఆయనకు ఏర్పడిన పరిచయం అనంతరం ప్రేమగా మారింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇటీవల పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆమెతో చర్చించి మందాకినిని నమ్మించి తన కారులోనే కోనాపూర్ శివారుకు తీసుకెళ్లిన ప్రకాశ్ అక్కడ పెట్రోల్ పోసి కాల్చి చంపాడు.
మందాకిని సోమవారం రాత్రి విధులు నిర్వహించిన తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ కుమార్తె కనిపించడంలేదని నిన్న పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ప్రకాశ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.