ఏపీ ఎన్నికల్లో అధికార టీడీపీకి చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల నుంచే వెన్నుపోట్లు ఎదురయ్యాయి. మరికొందరు పార్టీ అభ్యర్థులను చివరి వరకు నమ్మించి నిండా ముంచడంతో పాటు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. ఇక కొందరు నేతలు పార్టీ అభ్యర్థి ఇచ్చిన డబ్బులు పంచకుండా వాటిని దాచేసుకున్నారు. ఇలా ఒక్కో నియోజకవర్గంలో.. ఒక్కో అభ్యర్థి ఒక్కో విధమైన మోసానికి గురైనట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు వరకు ఎవ్వరూ వీటిపై నోరు మెదపలేదు. ఇప్పుడు ఎన్నికలు కంప్లీట్ అయ్యి ఫలితాల కోసం సుదీర్ఘంగా వెయిట్ చేయాల్సి రావడంతో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు సైతం లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ తరపున పోటీ చేస్తోన్న అభ్యర్థులు వీటిని బాబు వద్ద ఫిర్యాదు చేయగా ఆ వెన్నుపోటు, కుట్రదారులపై చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పార్టీలో ఉంటారా ? పోతారా ? అని కూడా వార్నింగ్లు ఇస్తున్నట్టు భోగట్టా.
ఈ వెన్నుపోట్లు సాధారణ అభ్యర్థులకే కాదు మంత్రులకూ తప్పలేదు. నెల్లూరులో మంత్రి నారాయణ ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేశారు. ఓటర్లకు పంచమని ఇచ్చిన రూ.40 కోట్ల సొమ్మును నగరంలో ఉండే నలుగురు కీలకనేతలు దాచేసుకున్నారు. ఓ మాజీ మంత్రి, ఆయన భార్యతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే, మరో కీలక నేత ఇలా నలుగురు కలిసి ఎవరికి ఇచ్చిన డబ్బును వారు పంచలేదు. ఎన్నికల తర్వాత ఈ విషయం నారాయణకు తెలిసినా ఆయన చేసేదేం లేకపోయింది. ఆ తర్వాత వాళ్లకు ఫోన్ చేసి.. మీరు నన్ను నమ్మించి మోసం చేశారని అనడం మినహా ఆయన ఎవరికి చెప్పుకోలేక గమ్మునుండిపోయారు.
ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్కు కూడా సీటు ఇవ్వలేదు. ఉమామహేశ్వరనాయుడు అనే కొత్త వ్యక్తికి బాబు సీటు ఇచ్చారు. అక్కడ సీటు రాని వాళ్లు టీడీపీ అభ్యర్థికి ఓటు వేయవద్దని తెరవెనక కుట్రలు చేశారు. అలాగే అభ్యర్థి తరపున పంచాల్సిన డబ్బును కూడా నొక్కేశారు. ఉమామహేశ్వరనాయుడు గెలిస్తే ఎక్కడ తమ పెత్తనానికి బ్రేక్ పడుతుందని.. తమ రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుందనే వారు ఆయన్ను ఓడించేందుకు ప్లాన్ చేశారు. ఎన్నికలు ముగిశాక ఉమహేశ్వరనాయుడు టీడీపీలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేసి, ఎన్నో పదవులు అనుభవించారు.. చివరికి టీడీపీలోనే ఉంటూ పార్టీకే ద్రోహం చేస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనకు వ్యతిరేకంగా పనిచేసినట్లు తన వద్ద ఫోన్ కాల్స్ రికార్డింగ్, వీడియో క్లిప్పింగులు కూడా ఆధారాలున్నాయన్న ఉమామహేశ్వరనాయుడు వాటిని చంద్రబాబు వద్ద పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్కు చంద్రబాబు సీటు ఇవ్వలేదు. ఇందుకు ఆయన స్వయంకృతాపరాధమే కారణం. ఈ క్రమంలోనే ఏకంగా ఎమ్మెల్యే టికెట్ బొరగం శ్రీనివాస్కు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఎన్నికల్లో బొరగంకు అండగా నిలవాలని, టీడీపీ పక్షాన ప్రచారం చేయాలని సూచించారు. పార్టీని గెలిపించాలని ఆదేశించారు. పైకి చంద్రబాబు వద్ద మొహమాటానికి ఓకే చెప్పిన మొడియం బొరగం నుంచి రూ.5 లక్షలు ఖర్చుల కోసం తీసుకుని ఇంట్లో పడుకున్నారు. అదేమంటే.. ఎండలు మండిపోతున్నాయని, తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పుకొచ్చారు. ఇలా పార్టీ నుంచి లబ్ధి పొంది ఐదేళ్ల పాటు పదవులు అనుభవించిన వారందరు ఇప్పుడు ఎన్నికల్లో ఇలా మోసం చేయడంపై బాబు ఆగ్రహంతో ఉన్నారు. రేపు ఎన్నికల ఫలితాల తర్వాత వీరిపై పార్టీ పరంగా చర్యలు ఉండనున్నాయి.