దశాబ్ధ కాలంగా భారత్ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ పదే పదే ఐక్య రాజ్య సమితిని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్ దే పైచేయి అయింది.
మసూద్ అజహర్ ని బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్లు భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. అందరికీ శుభవార్త మసూద్ అజహర్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది. అందరికీ ధన్యవాదాలు అని అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు.
Big,small, all join together.Masood Azhar designated as a terrorist in @UN Sanctions listGrateful to all for their support. #Zerotolerance4Terrorism
దీంతో ఐక్య రాజ్య సమితిలో భారత్కు భారీ విజయం లభించినట్లైంది పఠాన్కోట్, యూరీ, పుల్వామా దాడుల ప్రధాన సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ ను ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇంతకాలం మసూద్ అజహర్ ను వెనకేసు కొచ్చిన చైనా తాజాగా తన వైఖరి మార్చుకుంది. భారత్కు మద్దతుగా నిలిచింది. దీంతో మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఉన్న ఇబ్బందులన్నీ తొలగి పోయాయి.
ఇంత కాలం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ భారత్ కు మద్దతిచ్చినా చైనా మాత్రం సాంకేతిక కారణాల పేరుతో మోకాలడ్డుతూ వచ్చింది. పాకిస్థాన్ కే అండగా నిలిచింది. అయితే ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకే వాణి వినిపిస్తున్న తరుణంలో చైనా దారి లోకి రాక తప్పలేదు.
మరోవైపు ఉగ్రవాదంపై పోరులో ప్రపంచ దేశాలన్నీ కలిసి రావడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. తమకు మద్దతిచ్చిన అన్ని దేశాలకూ ధన్యవాదాలు తెలిపింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం వల్ల మసూద్ అజహర్ పై తీవ్ర ఆంక్షలు ఏర్పడతాయి. మసూద్ ఆస్తులను పూర్తిగా స్థంభింప చేస్తారు. కదలికలపై నిషేధం ఉంటుంది. ఐక్య రాజ్య సమితి తీసుకున్న నిర్ణయంతో పాకిస్థాన్ మరిన్ని చిక్కుల్లో పడింది. అసలే ఉగ్రవాద కేంద్రంగా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్కు ఐక్య రాజ్య సమితి ఇచ్చిన షాక్తో అంతర్జాతీయంగా పరువు పోయినట్లైంది.
1999లో కాందహార్ విమాన హైజాక్ ఘటనలో ప్రయాణికులను విడిపించుకునేందుకు మసూద్ అజహర్ను నాటి ఎన్డీయే ప్రభుత్వం విడిచిపెట్టాల్సి వచ్చింది. భారత్ లో లోక్సభ ఎన్నికలవేళ మసూద్ అజహర్ ను ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం నరేంద్ర మోదీ సర్కారుకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.