ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఒక్కటే ఉత్కంఠ నెలకొంది. టిడిపి, వైసిపి, జనసేన ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నా.. వాస్తవంగా ఎవరికి వారే లోపల ఫలితాలు ఎలా ? ఉంటాయి అని తీవ్రమైన ఆందోళన ఉంది. లోపల ఎలా ? ఉన్నా పైకి మాత్రం వారు మేకపోతు గాంబీర్యాన్ని ప్రదర్శిస్తూ గెలుపు తమదేనని మీడియా ముందు హల్చల్ చేస్తున్నారు. టిడిపి తమకు ఏకంగా 150 సీట్లు వస్తాయని అంటోంది. ఇక వైసీపీ ముందు నుంచి చెప్పినట్టుగానే 120 సీట్లు గ్యారెంటీ అని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక జనసేన సైతం 50 సీట్లలో తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటోంది. ఎవరి లెక్కలు ఎలా ఉన్నా మెజార్టీ సర్వేలు, అంచనాలు, మేధావుల విశ్లేషణల ప్రకారం వైసిపికి స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది. ఈ ఎన్నికల్లో టిడిపికి చెందిన కంచుకోటల్లాంటి పలు నియోజకవర్గాల్లో ఈ సారి ఆ పార్టీ ఓడిపోతుందని పోలింగ్ సరళి చెబుతోంది.
తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా గత కొన్ని ఎన్నికల్లోనూ మంచి ఫలితాలను ఇస్తోంది. 2009లో ప్రజారాజ్యం ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ గాలులు రెండోసారి వీచినా... ఈ రెండు ప్రభంజనాలు తట్టుకొని జిల్లాల్లో మచిలీపట్నం ఎంపీ సీటుతో పాటు, మెజారిటీ అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీతో కలుపుకుని టీడీపీ మళ్లీ 11 సీట్లలో విజయం సాధించడంతో పాటు మంచిలీపట్నం, విజయవాడ ఎంపీ సీట్లను భారీ మెజారిటీలతో గెలుచుకుంది. ఇక గత ఎన్నికల తర్వాత చంద్రబాబు విజయవాడ సమీపంలోనే అమరావతి రాజధాని ఏర్పాటు చేయడంతో పాటు నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐదేళ్లలో రాజధాని జోన్ కావడంతో కొంత అభివృద్ధి జరిగినా చాలా రంగాల్లో విజయవాడ వెనకపడే ఉంది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ అతీగతీ లేదు. ట్రాఫిక్ సమస్యకు మోక్షం లేదు. ఐదేళ్లలో విజయవాడలో ఉదయం, సాయంత్రం అయితే ట్రాఫిక్ నిత్యనరకమే.
ఇక ఈ ఎన్నికల్లో జిల్లాకు చెందిన పలువురు టీడీపీ సీనియర్లు ఓటమి బాటలోనే ఉన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు పోటీ చేయగా వీరిలో ఇద్దరు మంత్రుల ఓటమి ఇప్పటికే ఖాయమైందని... వీరు ఇంటిబాట పట్టినట్టే అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ టార్గెట్లో ఉన్న ఓ మంత్రికి ఈ సారి ముచ్చెమటలు పట్టాయి. గెలుపుపై ఆయన డౌట్లోనే ఉన్నారు. మరో మంత్రి చేసిన అవినీతి దెబ్బతో పాటు జనసేన ఎఫెక్ట్తో ఆయన అక్కడ చిత్తుగా ఓడిపోవడం గ్యారెంటీయే అంటున్నారు. ఇక తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న నందిగామలో ఈ సారి వైసీపీ గ్యారెంటీగా గెలుస్తుందని పందేలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. జగ్గయ్యపేటలో వైసీపీ క్యాండెట్ ఉదయభానుకు అనుకూలంగా పోలింగ్ జరిగింది.
మరి విచిత్రం ఏంటంటే నగరంలో ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మంచి పేరు ఉంది. ఆయన ముందు నుంచి గెలుస్తాడనే అనుకున్నారు. అయితే పోలింగ్కు ముందు చివరి రెండు రోజులు ఆయన అతి ధీమాతో ఆయన కొంప మునిగిపోయింది. దీంతో ఇప్పుడు ఆయన కూడా ఓడిపోతారని అంటున్నారు. పైగా ఆ నియోజకవర్గంలో జనసేన భారీగా ఓట్లు చీల్చడం కూడా టీడీపీ ఓటమికి మరో కారణం కావచ్చు. ఇక జిల్లాలో కాంట్రవర్సీలకు కేరాఫ్గా ఉండే మరో ఎమ్మెల్యే సైతం ఓటమి బాటలోనే ఉన్నారు. ఇక ఎలాంటి వివాదాలు లేకుండా తన పని తాను చేసుకుపోయే మరో సీనియర్ ఎమ్మెల్యేకు తన నియోజకవర్గంలో జనసేన నుంచి వచ్చిన గట్టి పోటీ దెబ్బతో ఇప్పుడు ఆయన కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. మొత్తానికి ఈ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ ఇండస్ట్రీ పెద్దలు ఇంటిబాట పట్టడం ఖాయమైంది.