ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో రీపోలింగ్ నిర్వహించాలని డిసైడయింది. రీపోలింగ్ జరిపే బూత్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలందాయి. గుటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మొత్తం 5 చోట్ల రిపోలింగ్ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 6వ తేదీన రీపోలింగ్ జరగనుంది.
పోలింగ్ సందర్భంగా ఈవీఎంల్లో తలెత్తిన లోపాల కారణంగా ఈ ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కోరుతూ స్థానిక కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి నివేదికలు పంపిన సంగతి తెలిసిందే. వీటిని పరిశీలించిన ద్వివేదీ ఈ ఐదు చోట్ల రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు. సిఫార్సులను పరిశీలించిన సీఈసీ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది.
కాగా, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధి కేసనపల్లిలోని 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు జిల్లాలోని సూళ్లురుపేట నియోజకవర్గంలోని అటకానితిప్పలోని 197వ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని పల్లెపాలెంలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్ కేంద్రం, ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం కలనూతలలో ఉన్న 247వ పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీ నిర్ణయించింది.