శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు ఎన్నికలు హోరా హోరీగా జరుగుతున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ ఏదో రూపంలో తమ గెలుపు ఓటములను ముందే తెలుసు కోవాలని అనుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు రకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. అయితే, ఇంత వరకు ఏ రాజకీయ పార్టీకి రాని (ఆలోచన చేయని) రీతిలో పశ్చిమబెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సరికొత్త ఎత్తుగడ వేశారు.
ఓటర్లు తమకే ఓటు వేశారో? లేదో? తెలుసుకోవడానికి విచిత్రమైన ఎత్తుగడ వేశారు. చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలో తృణమూల్ పార్టీ అభ్యర్థుల పేరు ఎదురుగా ఉన్న బటన్పై అత్తరు పూశారట. తొలుత కార్యకర్తలు ఓటేయడానికి వెళ్లి ఆ బటన్కు అత్తరు రాయడం, ఆ తరువాత ఓటేసి వచ్చినవారి వేలిని వాసన చూసి వారు తమకే ఓటేశారో లేదో తెలుసుకున్నారట. అయితే అత్తరు వాసన ఎక్కువసేపు ఉంటుందో లేదో అన్న అనుమానంతో హార్డ్-కోర్ కార్యకర్తలంతా ఒకేసారి ఓటేయకుండా గంట కొకరు వెళ్లి తాము ఓటేసి, ఆ బటన్పై అత్తరు పూసి వచ్చారట.
ఆ తరువాత పార్టీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల బయట కాపు కాసి ఓటేసి వచ్చినవారిని ఆపి వారి వేలిని వాసన చూసి అత్తరు వాసన వస్తే తమకు వేసినట్లు, రాకుంటే తమకు వేయనట్లుగా నిర్ధారించుకున్నారట. ఈ ప్రక్రియ కాసేపు కొనసాగే సరికి ప్రతిపక్ష పార్టీలకు విషయం అర్థమై దీనిపై ఫిర్యాదులు చేశారు. ఇలా ఓటు వేశారో లేదో తెలుసుకునే క్రమంలో ఓటర్ల తోనూ తృణమూల్ కార్యకర్తలకు ఘర్షణలు జరిగాయి. మొత్తానికి మమత పార్టీ కార్య కర్తల అతి తెలివి తేటలు చూసి మిగతా పార్టీలన్నీ షాకయ్యాయట.