ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరిందని ఆరోపించిన సంగతి తెలిసిందే. డ్రెస్సుల మీద మోజు ప్రధాని మోడీకే ఉందన్న విషయం అందరికీ తెలుసన్నారు. 'గంటకో డ్రెస్ మార్చి మోడీ ఆర్భాటం చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్కో డ్రెస్సు, లంచ్కి మరో డ్రస్సు, మధ్యాహ్నం ఇంకో డ్రెస్సు వేస్తున్నారు. మోడీ చెప్పిన మార్పు డ్రెస్సులు మార్చడంలోనే కనబడుతోంది' అని సెటైర్లు వేశారు . ప్రతిపక్ష పార్టీలు కొత్త డ్రెస్సులు వేస్తున్నారని మోడీ దిగజారి మాట్లాడుతున్నారని బాబు విమర్శించారు.
అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నరేంద్ర మోడీ గంటకో డ్రెస్ మారుస్తారో లేదో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తారని ఎద్దేవా చేశారు. నిమిషానికో మాట మారస్తూ నిజాయితీగా ఉన్న అధికారుల సీటు మారుస్తారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొని వాళ్ల పార్టీ మార్చారని, అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు సీటుని మారుస్తున్నారని జోస్యం చెప్పారు.