ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, ప్రధాని నరేంద్రమోదీ, బిజేపి అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగాలపై ఫిర్యాదులు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. తమ ప్రసంగాలు ఎన్నికల నియమావళిని-ఎన్నికల కోడ్ ఉల్లఘించేలా ఉన్నాయని ఇప్పటికే అనేకమార్లు కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే నరేంద్ర మోదీ, అమిత్ షా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా, ఈసీ చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ సుస్మితా దేవ్ పిటిషన్ దాఖలు చేయడంతో, సుప్రీంకోర్టు ఈసీకి ఈ నెల ఆరవ తేదీని డెడ్-లైన్ విధించింది.
ఈసీ తమకు అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై నిర్ణయం తీసుకున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. మరో 9 ఫిర్యాదులపై మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అందుకు సమయం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. ఆదివారం వరకు సమయం ఉన్నందున త్వరగా ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవా లని ఈసీకి సూచించింది. తదుపరి విచారణను మే 6 కు వాయిదా వేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోడ్ ఉల్లంఘనపై సుప్రీంలో నేడు విచారణ జరిగింది. ఫిర్యాదులపై ఈ నెల ఆరో తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ఈసీని ఆదేశించింది. అయితే ఈ నెల ఎనిమిదో తేదీ వరకు సమయం కావాలని ఎన్నికల కమిషన్ సుప్రీంని కోరింది. తాము తీసుకున్న చర్యలను సోమవారమే తమకు తెలపాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది.