భారతదేశంలోని బక్క రైతులు గెలిచారు. తన పలుకుబడితో అన్నదాతలను ఆవేదనలో ముంచాలని భావించిన ప్రముఖ వ్యాపార సంస్థ పెప్సికో తోకముడిచేలా చేశారు. అంతర్జాతీయ కుట్రలను చేధించేలా సోషల్ మీడియా సహా పౌరసమాజం కల్పించిన మద్దతుతో ఊహించని విజయం సాధించారు. ఇదంతా గుజరాత్లోని నలుగురు రైతులు సాధించిన విజయం. దేశమంతా కదిలితే..ఎలాంటి స్పందన వస్తుందో తెలియజేసేందుకు ఒక ఉదాహరణ. మన నోటిలోకి నాలుగు ముద్దలు వెళ్లేందుకు కారణమైన రైతుకు గర్వకారణంగా నిలిచే విజయానికి సహకరించిన వారందరికీ అన్నదాతలు కృతజ్ఞతలు తెలుపుతున్న సందర్భం ఇది.
ఇటీవల రైతులపై కేసు వేసిన సంచలన ఉదంతం గురించి మనందరికీ తెలిసిన సంగతే. గుజరాత్లో నలుగురు రైతులు ఫలానారకం 'బంగాళాదుంప'ను (ఆలు) పండించడానికి వీల్లేదంటూ పెప్సీకో కంపెనీ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తమ బ్రాండెడ్ విత్తనాన్ని రైతులు పండించటం, ఉత్పత్తి చేయటం...డబ్ల్యూటీఓ నిబంధనలకు విరుద్ధం..అంటూ రూ.4.2కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ పెప్సీకో కోర్టులో దావా వేసింది. తమకు మేథోపరమైన హక్కులు కలిగిన విత్తనరకానికి చెందిన 'ఆలు'ను గుజరాత్లోని నలుగరురు రైతులు తయారుచేయటాన్ని పెప్పికో అహ్మదాబాద్ సివిల్ కోర్టులో సవాల్ చేసింది.ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్, ఫార్మర్స్ రైట్స్(పీపీవీ, ఎఫ్ఆర్) చట్టం, 2001లోని సెక్షన్ 64ను పేర్కొంటూ పెప్సీకో కోర్టును ఆశ్రయించింది. తమ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కోర్టులో కంపెనీ వాదనలు వినిపించింది. 'బ్రాండెడ్ సీడ్'(విత్తనం) మరోకరు పండించడానికి వీల్లేదని కంపెనీ వాదించింది.
అయితే, రైతులను కార్పొరే ట్లు ఎలా దోచుకుంటున్నారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రైతుల భవిష్యత్తు పై ప్రభావం చూపిస్తాయని తమ తరఫున కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. నేషనల్ జీన్ ఫండ్ ద్వారా కోర్టులకయ్యే ఖర్చులను భరించాలని కోరారు. అన్నదాతల ఆవేదనకు మద్దతుగా పౌర సమాజం కదిలింది. సోషల్ మీడియాలో పెప్సికో తీరుపై వ్యతిరేక ప్రచారం హోరెత్తింది. పెప్సికోకు సంబంధించి ఉత్పత్తులను నిషేధించాలని ప్రజలకు కొందరు పిలుపునిచ్చారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తోకముడిచింది. నలుగురు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. ఇది సభ్య సమాజం చైతన్యంతో సాగించిన విజయమని పేర్కొంటున్నారు.