ఈ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఏపీలో జనసేన ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో ? జనసేన ఎఫెక్ట్ టీడీపీకి ఉంటుందా ? వైసీపీకి ఉంటుందా ? అన్నది తేలక ఈ రెండు పార్టీల వారు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేన ఈ ఎన్నికల్లో ఒంటరి పోరుకు రెడీ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ వైసీపీపై ఉంటే తమ పరిస్థితి ఏంటని ఆ పార్టీ నేతలు కూడా తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఇక టీడీపీ వాళ్లు కూడా ముందు ఇదే ఆందోళనలో ఉన్నా..ఆ తర్వాత క్రమక్రమంగా పవన్ తమ రహస్య మిత్రుడే అన్న విషయం తేలడంతో వాళ్లు ముందుగానే ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక జనసేనపై ఆశలు పెట్టుకున్న వారి కళ్లకు ఉన్న ముసురు తొలగింది. పవన్ చేష్టలు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలకు రెండు నెలల ముందే చంద్రబాబును మానేసి జగన్ను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేయడం ఇవన్నీ చూసిన వారు పవన్ చంద్రబాబు చేతిలో బొమ్మే అన్న నిర్ణయానికి వచ్చేశారు. అప్పుడే చాలా మంది పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని అనుకున్నా.. అప్పటికే టీడీపీ, వైసీపీలో దారులు మూసుకుపోవడంతో ఎవ్వరూ ఏం అనలేక గప్చుప్గా ఉన్నారు.
అయితే అప్పటికే జనసేనలో కొందరు కీలక నేతలకు పవన్ - చంద్రబాబు మధ్య అండర్స్టాండింగ్ అర్థమై బయటకు విమర్శలు చేయకపోయినా లోపల మాత్రం తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆశలు పెట్టుకుని ఆ పార్టీలో చేరిన బలమైన నేతలకు సైతం పవన్ టిక్కెట్లు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్లకు టిక్కెట్లు ఇస్తే ఆ నియోజకవర్గాల్లో టీడీపీ మైనస్ అవుతుందనే. ఇక ఎన్నికలు ముగిశాయో లేదో జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. కీలక నేత జనసేనకు రాజీనామా చేశారు. మారిశెట్టి రాఘవయ్య జనసేనకి గుడ్ బై చెప్పారు. పార్టీకి, పదవులకి ఆయన రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు పవన్ కి పంపారు.
రాఘవయ్య గతంలో ప్రజారాజ్యం పార్టీలోనూ.. ఇప్పుడు జనసేలోనూ చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన రాజీనామా పార్టీకి పెద్ద దెబ్బగానే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మారిశెట్టి రాఘవయ్య సీనియర్ నేత, జనసేన కోశాధికారిగా ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో పార్టీని వీడుతున్నట్టు చెప్పినా టీడీపీ - జనసేన ఒప్పందం వల్లే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పినట్టు టాక్. ఇప్పుడే ఇలా ఉంటె ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంటన్నది నేతల్లో అయోమయం నెలకొంది. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే పవన్కు రైట్ హ్యాండ్గా ఉండడంతో పాటు గుంటూరు జిల్లా నుంచి పోటీ చేసిన ఓ కీలక నేతతో పాటు స్టేట్ కమిటీలో ఉన్న మరో నేత సైతం పార్టీకి గుడ్ బై చెప్పేస్తారని తెలుస్తోంది. ఏదేమైనా మే 23 ఫలితాల తర్వాత జనసేనలో పెను ప్రకంపనలు చోటు చేసుకోనున్నాయి.