ఫోని తుఫాన్ ఏపీని, ఒడిషాను వణికిస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున వీస్తున్న గాలులతో, భారీ హెచ్చరికతో ఈ తుఫాను సృష్టిస్తున్న కలకలం మామూలుగా లేదు. దీనిపై టీడీపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే....ఈ తుఫాను విషయంలో...తాము ఏదో చేసేవారమని ప్రకటిస్తున్నారు. అయితే, టీడీపీ నేతలు చేస్తున్న ఈ ప్రకటనలపై సోషల్ మీడియాలో భారీగా సెటైర్లు వేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ మెసేజ్ ఇది. ``అధికారులు స్వేచ్ఛగా పనిచేస్తే ఎలా ఉంటుంది?
ఇప్పుడు వచ్చిన పోని తూఫాన్ ఈ రోజు ఒడిశా రాష్ట్రం పూరి దగ్గర తీరం దాటబోతుంది.
గతంలో కొన్ని వందల తూఫాన్ లు వచ్చినప్పుడు ఎప్పుడూ మీడియా లో గత 5 ఏళ్లగా చూపించినట్లు చూపించలేదు.
ఆయనే స్వయంగా సముద్రం లోకి వెళ్లి తూఫాన్ దిశ ను మార్చేసేవాడు.
కొన్ని తూఫాన్లు ఆయన మాట వినకుండా వచ్చేవి. అప్పుడు...ఆయనే అందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించేవాడు. ఆయనే మళ్ళీ సముద్రంలోకి వెళ్లి చేపల వేటకు వెళ్లిన వారిని తీసుకుని వచ్చేవాడు. రోడ్డు మీద చెట్టు పడిపోతే ఆయనే రంపం పట్టుకుని కోస్తాడు.
కరంట్ స్థంభం పడిపోతే ఆయనే సిమెంట్తో తయారు చేసి ఆయనే నిలబెట్టేవాడు. పంట నీటిలో తడిస్తే ఆయనే ఎండబెట్టేవాడు. ఇవన్నీ మన మీడియాలో గత 5 ఏళ్లుగా చూశాం. కానీ గత 2 రోజులుగా మీడియాలో ఎలాంటి హడావుడి లేదు. దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా విమర్శ రాలేదు. ఎక్కడా ఏ అధికారి రాత్రి మొత్తం ఆఫీసులో కూర్చుని పని చేసినట్లు మీడియాకి ఫోటోలు రాలేదు. రేపు కూడా అంతే!
గతంలో చిన్న వాన పడినా లేని కోళ్లు , లేని మేకలు, లేని పశువులు అనేకం చనిపోయేవి. కోడికి 5 వేలు, మేకకి 10 వేలు , పశువుకి 25 వేలు పరిహారం చెల్లించేవారు. పొలం లేని రైతుకి పంట నష్టం కింద డబ్బు అకౌంట్ లోకి వచ్చేది. ఇప్పుడు కచ్చితంగా అలా జరగదు. బాధితులందరికీ న్యాయం జరుగుతుంది.``
ఇది సెటైరికల్ విశ్లేషణ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హడావుడిని చూసే ఈ పోస్ట్ ఎవరో రాసి ఉంటారని అంటున్నారు. ఈ పోస్ట్ను చూసి కొందరు టీడీపీ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారని చెప్తున్నారు. బాబు గారి ప్రచారం ఈ రేంజ్లో సాగిందా అంటూ వారు చర్చించుకుంటున్నట్లు చెప్తున్నారు.