రాష్ట్రంలో రాజ్యాంగ
సంక్షోభం తప్పేట్లు లేదు. ఎన్నికల కమీషన్
అధికారాలనే చంద్రబాబునాయుడు సవాలు చేస్తున్నారు. వచ్చే వారం క్యాబినెట్ సమావేశం
పెడతానని ఎవరు అడ్డుకుంటారో చూస్తానని శుక్రవారం చాలెంజ్ చేశారు. మీడియాతో
చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్నికల కమీషన్ తన
పరిధిలో తానుండాలంటూ ఘాటుగా మాట్లాడారు.
చంద్రబాబు మాటలు చూస్తుంటే ప్రధాన కార్యదర్శిని లొంగదీసుకోవాలన్న పట్టుదలే కనిపించింది. తన వద్దకు చీఫ్ సెక్రటరీని రమ్మని తాను అడుక్కోవాలా ? అంటూ మండిపడ్డారు. అంటే చీఫ్ సెక్రటరీగా నియమితులయిన దగ్గర నుండి ఎల్వీ సుబ్రమణ్యం ముఖ్యమంత్రిని కలవలేదని అర్ధమవుతోంది. ఎలాగైనా తన దగ్గరకు సిఎస్ ను రప్పించుకోవాలన్నదే చంద్రబాబు పట్టుదలగా కనిపిస్తోంది.
ఒకవైపు ఎన్నికల కమీషన్ పై కోపం మరోవైపు ఎల్వీపై మంట కలిసి రాజ్యాంగ సంక్షోభం దిశగా పరిస్ధితులు సాగుతున్నట్లు అనుమానంగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుండి కోడ్ అమలులో ఉన్నంత వరకూ క్యాబినెట్ సమావేశాలు పెట్టేందుకు లేదు. ఆ విషయం చంద్రబాబుకు తెలీక కాదు. అయినా సరే క్యాబినెట్ సమావేశం పెడతానని అన్నారంటే ఈసితో తాడో పేడో తేల్చుకునే ఉద్దేశ్యంతోనే ఉన్నట్లు అర్ధమవుతోంది.
పైగా క్యాబినెట్ సమావేశానికి రాని ఉన్నతాధికారులపై బిజెనెస్ రూల్స్ ప్రకారం సీరియస్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించటం గమనార్హం. ఎన్నికల విధుల్లో ఉన్న ఉన్నతాధికారులు తన సమీక్షలకు రాలేదంటే అర్ధముంది అనటంలో అర్ధమేంటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎందుకంటే, సిఎస్ కూడా ఎన్నికల కమీషన్ పరిధిలోకే వస్తారు. కాబట్టే ఎల్వీ చంద్రబాబు దగ్గరకు వెళ్ళలేదేమో ? మొదటి నుండి ఎల్వీ అంటే చంద్రబాబుకు బాగా మంటగానే ఉంది.
ఎల్వీ నియామకం నుండి ఆయనపై చంద్రబాబు మండిపడుతునే ఉన్నారు. ప్రధాన కార్యదర్శిని అనరాని మాటలని చంద్రబాబు మానసికంగా చాలానే హింసించారు. దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. టిడిపి మళ్ళీ అధికారంలోకి రాదన్న సమాచారం ఎల్వీకి ఉందేమో. ఆ కారణంతో కూడా ఎల్వీ చంద్రబాబును కలవలేదేమో ? ఏదైనా చంద్రబాబు సవాలు ఏపిలో రాజ్యాంగ సంక్షోభం తప్పదనే అనిపిస్తోంది.