తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పదనిసలు ఎన్నో సంభవిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే, తాజా టీఆర్ఎస్ మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగాఆయన కరీం నగర్ జిల్లా మానకొండూర్ మండలకేంద్రంలో ని గంగిపల్లి, కొండపలకల గ్రామాల్లో మాట్లాడుతూ,టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే అభివృద్ధి పనులు జరుగుతాయని, ఇతరులు గెలిస్తే పనులు కావని హెచ్చరించారు. కారుకు అడ్డం పడితే టక్కరైతరని( యాక్సిడెంట్ పాలవుతారని) హెచ్చరించారు.
స్థానికులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ, ‘‘ఇప్పుడు మంచి మంచి ఎమ్మెల్యేలు వచ్చి గులాబీ జెండా కప్పుకుంటున్నారు. ఊరంతా ఒకదిక్కుంటే ఊసుకండ్లోళ్లు ఒక దిక్కు ఉన్నట్టు ఉండద్దు. కారుకు అడ్డం పడితే టక్కరైతది తప్ప పనులైతయా అని అడుగుతున్న”అని ప్రశ్నించారు.‘‘కారు గుర్తు గెలిస్తే మాత్రమే పనులైతయి. `వేరోళ్లు ఇది జేస్త అది జేస్త అంటే ఏమీ కాదు. ఊరికి కావాల్సి న పర్మిషన్లు గిర్మిషన్లు అన్ని నేనే ఇప్పిస్త. కల్యాణలక్ష్మికి ఎమ్మెల్యేగా నేను సంతకం పెడితేవస్తది .సర్పంచ్ వేరే దిక్కుకు పోతే వస్తదా ? సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే ఏముఖంపెట్టు కొని అడుగుతరు. ఒక్క ఓటు కూడా వేరే దిక్కు కు వేస్తే పనులు కావు”అనిపేర్కొన్నారు. గాడిదకు గడ్డేసి ఆవుకు పాలుపిండితే రావని, టీఆర్ఎస్ అభ్యర్థులకే ఓటు వేయాలని అన్నారు.
కాగా, రసమయి వ్యాఖ్యలు చూస్తుంటే....టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తమకు ఓటు వేయడం వల్ల జరిగే ప్రయోజనాలు గురించి చెప్పడం కంటే...ఓటు వేయకపోతే జరిగిన పరిణామాల గురించి ఆయన హెచ్చరించినట్లుగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇలా బెదిరింపులతో ఓట్లు అడగడం పట్ల విపక్షాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.