ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చర్యలను వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. విజయవాడలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం. పార్టీ బాపట్ల పార్లమెంట్ పార్లమెంట్ అభ్యర్ది నందిగం సురేష్ మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుతింటూనే ఉన్నారని మండిపడ్డారు. `` కృష్ణానదిని పూడుస్తుంటే చంద్రబాబుకు కనిపించలేదా ? లోకేశ్ కోసం కృష్ణానది రూపురేఖల్నే మార్చేస్తున్నారు.
రాజధాని పేరుతో అడ్డగోలుగా భూములు లాక్కున్నారు. జన్మభూమి కమిటీల పేరుతో ఇసుకను దోచుకున్నారు . అగ్రిగోల్డ్ బాధితుల హాయ్ ల్యాండ్ ను కూడా కాజేశారు. ఆస్తులను కూడబెట్టుకోవడానికి పంచభూతాలను దోచుకుంటున్నారు . వ్యవస్ధలను నాశనం చేసి ..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని ప్రజలు క్షమించరు. రాష్ట్ర సంపదను దోచుకున్నవారిని కటకటాల వెనక్కి పంపిస్తాం.`` అని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ అసెంబ్లీ అభ్యర్ది ఉండవల్లి శ్రీదేవి ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీడీపీ రాబంధులు రాజధానిని దోచుకుతింటున్నాయని ఆరోపించారు. టీడీపీ నేతలు దండుపాళ్యం దోపిడీ ముఠాలా తయ్యారయ్యారని మండిపడ్డారు. ``రాజధానిలో భూములను ఆక్రమించుకుంటున్నారు. సింగపూర్లా చేస్తానని రైతుల భూములు తీసుకుని మోసం చేశారు. అక్కడ అమరావతి కాదు భ్రమరావతి ఉంది. భూములు కబ్జా అయిపోయాక నేడు నదిగర్భంపై కూడా వారి కన్ను పడింది.
పెద్ద పెద్ద యంత్రాలతో 70 ఎకరాల మట్టిదిబ్బను నిర్మించి కబ్జాకు స్కెచ్ వేశారు. రిసార్ట్స్ కోసం కృష్ణానదినే పూడ్చేస్తున్నారు.లోకేష్ ఎంజాయ్ చేసిన విదేశి సంస్కృతిని ఇక్కడకు తెద్దామని చూస్తున్నారు. టీడీపీ అరాచకాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. సీఎస్,ఎలక్షన్ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలి.``అని డిమాండ్ చేశారు.