ఎన్నికలు అయిపోయాయి. వేడిని దించుకోవడానికి నాయకులు ఎవరి మటుకు వారు చేయని ప్రయత్నం లేదు. ఓ వైపు నడి నెత్తిన సూరీడు కాల్చేస్తున్నాడు. చేయడానికి బిజీ వర్క్ కూడా ఏదీ లేదు. మరి ఇంతకంటే మంచి తరుణం వేరే ఉందా. అందుకే ఎన్నికల్లో అలసిపోయిన వారంతా సేద తీరుతున్నారు. కొందరు పిల్లలైపోతున్నారు. మరి కొందరు యువకులుగా మారిపోతున్నారు. మొత్తానికి వారు వీరూ అన్న తేడా లేకుండా విహార యాత్రలో తరించేస్తున్నారు.


విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు ఫుల్ ఎంజాయ్ మూడ్లో వున్నారు. ఆయన బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టేసి మరీ విహార యాత్రకు వెళ్ళిపోయారు. తన కుటుంబంతోనే ఇపుడు గడుపుతున్నారు. తన మనవడితో ఆడుతూ  నీలం నీరున్న కొలనులో ఈత కొడుతూ గంటా చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వరా పంచుకున్నారు. నాకిపుడు ఎంతో హ్యాపీగా ఉందంటూ గంటా ట్వీట్ చేశారు.


'ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపాక నా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వచ్చాను. మనవడితో కలిసి నీలిరంగు నీటిలో ఆడుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ టూర్ కోసం ఎక్కడికి వెళ్లారన్న విషయమై గంటా స్పష్టత ఇవ్వలేదు. కానీ అది ఓ సముద్రతీర విహార కేంద్రమని ఫోటోలద్వారా తెలుస్తోంది. మొత్తానికి గంటా ముఖంలో ఎంతో సంతోషం కనిపిస్తోంది. మరి ఇదే తీరున మిగిలిన తమ్ముళ్ళు కూడా బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది.
కాగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. అలాగే, వైసీపీ  అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా తన కుటుంబ సభ్యులతో స్విస్ పర్యటనకు వెళ్లి వచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: