జేజేలు.. నినాదాలు.. కేరింతలు.. అభిమాన నేతలపై ప్రశంసలు.. పూల వర్షాలు.. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో కనిపించే దృశ్యాలు.. వినిపించే శబ్దాలు.. కానీ ఆయనకెందుకో క్యాంపెయిన్ కలిసి రావడం లేదు. ఒక్కో సారి ఒక్కో రీతిలో చేదు అనుభవం ఎదురవుతోంది.
ఇది అతనిపై ఉన్న వ్యతిరేకతా.. ప్రతిపక్షం పనిగట్టుకొని చేస్తున్నదా ? అన్నది అంతు చిక్కడం లేదు.
గతేడాది ముఖంపై సిరా చల్లారు.. మొన్నటికి మొన్న చెప్పులు విసిరారు.. కారంపొడి దాడులు చేశారు.. ఇప్పుడు చెంప చెళ్లు మనిపించారు. ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ప్రచారం కలిసిరావడంలేదు. చుట్టు కార్యకర్తలున్నా.. కొందరు బాహాటంగానే అసహనాన్ని వెల్లగక్కుతున్నారు. ఆయనపై భౌతిక దాడులకు దిగుతున్నారు.
ఢిల్లీలోని ఓ ప్రాంతంలో మెట్రో విస్తరణ చేపట్టడం లేదన్న కారణంతో రీసెంట్గా రెండు నెలల క్రితం కేజ్రీవాల్ కారుపై దాడులకు దిగారు కొందరు యువకులు. కేజ్రీవాల్ కారును అడ్డుకున్న సుమారు వంద మంది యువకులు.. సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని కేజ్రీవాల్ కారుపై కర్రలతో దాడులకు దిగారు.
తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఎన్నికల ప్రచారంలో మరో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని మోతీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్ పై సురేష్ అనే యువకుడు చెంపదెబ్బ కొట్టాడు. వందల మంది కార్యకర్తలను దాటుకుని ప్రచార రథం ఎక్కిన సురేష్ కేజ్రీవాల్ చెంపపై బలంగా కొట్టాడు. ఈ ఆకస్మిక ఘటనతో షాక్కు గురైన కార్యకర్తలు.. వెంటనే ఆ యువకుడ్ని చితకబాదారు. ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.