మంత్రి నారా లోకేష్. ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడిగానే కాకుండా తన వ్యాఖ్యలతో సర్వత్రా గుర్తింపు పొందిన యువ నాయకుడు. 2014 ఎన్నికల సమయంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన లోకేష్ .. 2017 నాటికి అనూహ్యంగా ఎమ్మెల్సీ అయి.. అటు నుంచి మంత్రిగా పీఠమెక్కారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎన్ని వ్యాఖ్యలు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకు సాగారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎదురైన ``దొడ్డి దారిలో వచ్చిన మంత్రి`` అనే వ్యాఖ్యలను కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే, తాజాగా గత నెలలో జరిగిన ఎన్నికల్లో అనేక తర్జన భర్జనల అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ కి దిగారు.
ఇక్కడ నుంచి లోకేష్ పోటీ చేయడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ప్రభుత్వానికి కంట్లో నలుసుగా మారిపోయారు. బాబు ప్రభుత్వ నిర్ణయాలపై ఆయన కోర్టు కెక్కడంతో ఆయనను ఎట్టిపరిస్థితిలోనూ ఓడించి తీరాలని బాబు నిర్ణయించుకున్నారు. ఇక, రాజధాని నగరానికి దగ్గరలోనే ఉన్న నియోజకవర్గం కావడం లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణాలుగా భావిస్తు న్నారు. అధికారంలో లేకపోయినా.. ఆళ్ల ఇక్కడ అభివృద్ధికి ఏనాడూ రాజీ పడలేదు. సొంత నిదులను సమీకరించి మరీ అభివృద్ధి పనులు చేపట్టారు.
అదేవిధంగా రూ.4కే మధ్యాహ్న భోజనం, రూ.10కే సంచీనిండా కూరగాయలు వంటివి అందించి ప్రజలను తనవైపు తిప్పు కొన్నారు. పైగా బీసీ చేనేత వర్గం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో లోకేష్ పోటీచేయడం చరిత్రను సృష్టిం చింది. ఇ క, లోకేష్ ఈ నియోజకవర్గంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాను తొలిసారి ఇక్కడ నుంచి పోటీ చేయడం, గెలుపు గుర్రం ఎక్కకపోతే.. తనపై ఐరన్లెగ్ అనే ముద్ర పడుతుందని భావించిన నేపథ్యంలో లోకేష్.. సర్వశక్తులను ఒడ్డారు. తన సతీమణిని కూడా ప్రచారానికి రంగంలోకి దింపారు. ఇంటింటికీ తిరిగారు. ఇక, చంద్రబాబు కూడా ఒక దశలో ప్రచారం చేశారు.
ఇక, ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయిపోయింది. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మంగళగిరి ఎన్నికల పై మాత్రం అనేక కథనాలు, విశ్లేషణలు మాత్రం వస్తూనే ఉన్నాయి. లోకేష్కు ఇక్కడ గెలిచే సీన్లేదని ఇప్పటికే చాలా సర్వేలు స్పష్టంచేశాయి. ముఖ్యంగా ఏపీలోని పలు సర్వే సంస్థలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇక, ఇప్పుడు పొరుగు రాష్ట్రం తమిళనాడు కు చెందిన ``దినమలర్`` అనే పత్రిక కూడా లోకేష్పై కథనం ప్రచురించింది. ఆయనకు గెలుపు గుర్రం ఎక్కే అవకాశం లేదని, లోకేష్ గెలుపు అంత ఈజీకాదని తేల్చిచెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసినా.. ఆయనకు గెలుపు గుర్రం ఎక్కే ఛాన్స్ లేదని పేర్కొంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.