ఏపీలో మరోమారు పోలింగ్ జరగనుంది. రీపోలింగ్ జరగనున్న చోట్ల సోమవారం ఈ ప్రక్రియను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికలలో టెక్నికల్, ఇతర సమస్యలు తలెత్తిన చోట్ల రీ పోలీంగ్కు ఈసీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడు జిల్లాల పరిధిలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రీ-పోలింగ్ జరగనుంది. అయితే, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో భద్రత సమస్యగా మారింది.
రీపోలింగ్లో భాగంగా, గుంటూరు పశ్చిమ అసెంబ్లీ, గుంటూరు పార్లమెంటు పరిధిలోని 244 పోలింగ్ స్టేషన్ (నల్లచెరువు – 1376 మంది ఓటర్లు)లో పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేశారు. గుంటూరు జిల్లాలో నరసరావుపేట అసెంబ్లీ, నరసరావుపేట పార్లమెంటుకు చెందిన 94వ పోలింగ్ స్టేషన్ (కేశనుపల్లి – 956 మంది ఓటర్లు)లో రీ పోలింగ్ జరగనుంది. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉండే 197 పోలింగ్ స్టేషన్ (అటకానితిప్ప 578 మంది ఓటర్లు), ప్రకాశం జిల్లా పరిధిలోని ఎర్రగొండపాలెం అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు పరిధిలోని 247 పోలింగ్ స్టేషన్ (కలనూతల 1070 మంది ఓటర్లు), నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ, నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి 41 పోలింగ్ స్టేషన్ (ఇసుకపాలెం 1084 మంది ఓటర్లు), నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట అసెంబ్లీ పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన భధ్రతను ఈసీ అధికారులు సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుతో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఎన్నికలు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.