సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్ సోమవారం ఉదయం 7.00 గంటల నుంచి ప్రారంభమైంది. ఉత్తర్ప్రదేశ్, రాజస్థాన్ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతోంది. ఐదో దశలో మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 12 శాతం మంది మహిళలే. జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గానికి నేటితో పోలింగ్ ముగియనుంది.
ఈ నియోజకవర్గానికి మూడు, నాలుగు, అయిదు దశల్లో పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విడిత ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, యూపీయే ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ తదితర ఉద్దండులు పోటీచేస్తున్న నియోజకవర్గాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది.
కేంద్ర సహాయ మంత్రులు అర్జున్రామ్ మేఘ్వాల్, జయంత్సిన్హా, ఝార్ఖండ్ మాజీ సీఎం అర్జున్ ముండా, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, డిస్కస్ త్రోయర్ కృష్ణపునియా తదితరులు పోటీచేస్తున్న నియోజకవర్గాలు కూడా ఈ దశలోనే ఉన్నాయి.
సోమవారం నాటి పోలింగ్తో కలిపితే దేశంలో 424 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ముగిసినట్లవుతుంది. మిగతా 118 స్థానాలకు ఆరు, ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడులోని వెల్లూరు ఎన్నికను ఈసీ రద్దుచేసిన సంగతి తెలిసిందే.