తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం అమలు చేస్తున్నారంటూ పోలీస్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విధానం శృతిమించిపోయినట్లుంది. తాజాగా, ఓ పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి జన్మదిన వేడుకలను నిర్వహించారు. కీలకమైన ఎన్నికల బిజీ సమయంలో విధుల్లో ఉండాల్సిన పోలీసులు....కాంట్రాక్టర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కరీంనగర్ జిల్లా మానకొండూర్ పీఎస్లో ఓ వ్యక్తి జన్మదిన వేడుకలు నిర్వహించి ఇలా వివాదంలో చిక్కుకున్నారు.
కరీంనగర్కు చెందిన కాంట్రాక్టర్ రవీందర్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను మానకొండూర్ స్టేషన్లో సీఐ ఇంద్రసేనారెడ్డి నిర్వహించారు. కాంట్రాక్టర్ రవీందర్రెడ్డికి చెందిన ఒక్కో అక్షరానికి ఒక్కో కేజీ చొప్పున భారీ కేక్ తెప్పించడంతో పాటుగా పూలమాల వేసి కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఉన్న వ్యక్తి కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సామాన్యలుకు సమయం ఇవ్వని సీఐ ఇంద్రసేనారెడ్డి ఇలా సంబురాలు నిర్వహిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా సీఐ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ వ్యక్తులకే కొమ్ము కాస్తున్నారా? అనే ప్రశ్నలు వ్యక్తమువుతున్నాయి. పోలీసులకు సంబంధించిన భవనాలను గతంలో నిర్మించిన కాంట్రాక్టర్ కావడంతో ఈ సంబురాలు చేశారా అనే చర్చ తెరమీదకు వచ్చింది. కాగా, ఈనెల 4వ తేదీన ఈ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ అనుచరులు కావాలనే ఈ దృశ్యాలను కావాలనే విడుదల చేశారని తెలుస్తోంది. అయితే, పెద్ద ఎత్తున వైరల్ అయిన నేపథ్యంలో సీపీ కమాలాసన్ రెడ్డి శాఖపరమైన విచారణ చేసినట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో ఆయనకు అవకాశం కల్పించలేదు.