పోలవరం ప్రాజెక్టు
పర్యటనకు వెళ్ళిన చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులు షాక్ ఇచ్చారు. సోమవారం మధ్యాహ్నం
పోలవరం ప్రాజెక్టుకు వెళ్ళిన చంద్రబాబు పర్యటనలో ఉన్నతాధికారులెవరూ కనిపించలేదు.
జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి తో పాటు ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో పాటు ప్రాజెక్టును
పర్యవేక్షిస్తున్న అధికారులు కూడా హాజరుకాలేదు. దాంతో చంద్రబాబుకు పెద్ద షాక్
కొట్టినట్లైంది.
నిజానికి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నపుడు చంద్రబాబు ప్రాజెక్టు సంరద్శనకు వెళ్ళకూడదు. కానీ మంకుపట్టుపట్టి ప్రాజెక్టు సందర్శన అంటూ పోలోమని వెళ్ళారు. కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కనబడలేదు. కాబట్టి ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన చంద్రబాబుతో కాంట్రాక్టర్లే మాట్లాడారు. పనుల పురోగతిని కాంట్రాక్టర్లే వివరించారు.
ఐదేళ్ళూ ఏదో హడావుడి చేసిన చంద్రబాబు తాజాగా సందర్శనలో మాత్రం 2020కల్లా పోలవరం పూర్తి చేస్తామని కొత్త నాటకం మొదలుపెట్టారు. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఈ విషయం రాసిపెట్టుకోవాలంటూ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సవాలు చేశారు. 2018 పోయింది, 2019 కూడా పోయింది. చివరకు రేపటి కౌంటింగ్ లో టిడిపి అధికారంలోకి రావటమే అయోమయంలో పడింది.
దాంతో ప్రాజెక్టు పనులు నత్త నడక నడవటంపై చంద్రబాబు యధావిధిగా మోడిపై మండిపడ్డారు. ప్రాజెక్టు పూర్తవ్వటానికి కేంద్రం సహకరించలేదట. ఇచ్చిన డబ్బులకు లెక్కలు చెప్పటం చేతకాని చంద్రబాబు కేంద్రంపై నెపం వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారని వైసిపి, బిజెపిలు చేస్తున్న ఆరోపణలు నిజమే అనిపించేట్లుంది పరిస్ధితి.
చంద్రబాబు మాటలు చూస్తుంటే అప్పటికేదో మళ్ళీ తానే ముఖ్యమంత్రయ్యేట్లు, పోలవరాన్ని 2020కల్లా పూర్తి చేసేట్లు చెప్పేస్తున్నారు. మోడి మళ్ళీ అధికారంలోకి రారట కానీ తాను మాత్రం అధికారంలోకి రావటం ఖాయమనే భ్రమల్లో ఉండటమే విచిత్రంగా ఉంది.