యాదగిరిగుట్టా టు వయా ధర్మపురి. వ్యభిచార నిర్వాహకులు రూట్ మార్చారు. దత్తత పేరుతో గలీజు దందాకు దిగుతున్నారు. అభం.. శుభం తెలియని బాలికలను వ్యభిచార రొంపిలోకి లాగుతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో పోలీసుల నిఘా పెరగడంతో కేటుగాళ్లు తమ దార్లు మార్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు మధ్యలో ఉన్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో గలీజు దందా కొనసాగిస్తున్నారు.
చాలా ఏళ్లుగా ధర్మపురి రహదారిలో కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ధర్మపురి వ్యభిచారానికి అడ్డాగా మారింది. యాదగిరిగుట్ట ఘటన తర్వాత తమ కార్యకలాపాలకు ధర్మపురే కరెక్ట్ అని భావించిన వ్యభిచార నిర్వాహకులు అక్కడే తిష్ట వేసినట్లు సమాచారం. వివిధ పనులకు వచ్చినవారు వ్యభిచార గృహాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ దందా యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
ఇక డబ్బులు బాగా రవాడంతో వ్యభిచార నిర్వహాకులు మరింత బరితెగిస్తున్నారు. అనాథ పిల్లలను చిన్న వయసులోనే కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు సమాచారం. వారిని చదివిస్తాం.. ప్రయోజకులను చేస్తామం.. దత్తత తీసుకుని మంచిగా చూసుకుంటామని యుక్త వయసు రాగానే వారిని వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా వ్యభిచార నిర్వాహకులు నెట్వర్క్ ఏర్పడుచుకున్నట్లు తెలుస్తోంది. ఇక అప్పటివరకు అమ్మా, నాన్న అనుకునే వారు వారి ప్రవర్తన చూసిన తర్వాత బిక్కుబిక్కుమని ఏడుస్తున్నారు. వారికి ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.
ఇటీవల పోలీసులు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించడంతో ఈ గలీజు దందా వెలుగులోకొచ్చింది. ఈ దాడుల్లో ఐదుగురు బాలికలను పోలీసులు విచారించారు. అయితే నిర్వాహకులు మాత్రం తమ పిల్లలని చెప్పారు. అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.