రాజకీయంగా ఉన్న వైరాన్ని.. పాలనకు కూడా అన్వయించడం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకే చెల్లిందని అంటు న్నారు అధికారులు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో ప్రభుత్వాలు సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయాయి. అంటే... నైతికంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఉంటాయి. కానీ, సాంకేతికంగా మాత్రం వాటికి ఎలాంటి అధికారాలు ఉండవు. అంటే.. సమీక్షలు చేయడం, కొత్తగా జీవోలు జారీ చేయడం, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వంటివి చేయరాదు. అయితే, ఇక్కడ కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
ఏదైనా తుఫాను లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో మాత్రం కోడ్ నుంచి మినహాయింపు పొంది.. వాటి ని నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో మాత్రం సీఎం చంద్రబాబు వైఖరి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఆయన తనకు కోడ్ గీడ్ వంటివి ఏమీ ఉండవని తెగేసి చెబుతున్నారు. ఏవైనా ఉంటే.. రిటెన్గా చూపించా లని కోరుతున్నారు. తాను సమీక్షలు చేస్తానని, ఆఖరుకు కేబినెట్ మీటింగ్ కూడా పెడతానని అంటున్నారు. ఈ నెల 10న దాని కి కూడా ముహూర్తం పెట్టేశారు. ఇక, తాజాగా సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సంద ర్భంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రాజెక్టు వద్దకు రావాలని, అక్కడే సమీక్ష పెడతానని చెప్పారు.
కానీ, ఉన్నతాధికారుల్లో చాలా మంది డుమ్మా కొట్టినట్టు తెలిసింది. కోడ్ను ఉల్లంఘించి, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు మాటలు విని పట్టించుకోకుండా జీవోలు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేఠాకు ఏ గతి పట్టిందో తమకు కూడా అదే గతి పడుతుందని వారు భయపడుతున్నారు. అంతేకాదు, రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న వైరాన్ని ఇలా కోడ్ను ఉల్లంఘించడం ద్వారా చంద్రబాబు తమపై రుద్దాలని చూడడం ఏమాత్రం సబబు కాదని అంటున్నారు. ఈ క్రమంలోనే వారు బాబుకు అందుబాటులోకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇక, బాబు వైఖరిని చూస్తే.. మోడీ ఇటీవల కేబినెట్ మీటింగ్ పెట్టారని, తాను పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘానికి రాజ్యంగం ద్వారా వచ్చిన అధికారాన్ని కూడా చంద్రబాబు ఇలా ప్రశ్నించడంపై మేధావులు సైతం పెదవి విరుస్తుండడం గమనార్హం.