ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అక్రమాలు...అన్యాయాలు కేంద్రంగా మారిందని..పోలీస్ శాఖలో పోస్టింగ్ లపై విచారణ జరపాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి లేఖ రాశారు.
సామాజిక వర్గమే ప్రాతిపదికగా జరుగుతున్న డీఎస్పీ పదోన్నతుల వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. ఎన్నికలకు ముందు ఒకే సామాజిక వర్గానికి చెందిన 37 మందికి డీఎస్పీలుగా పోస్టింగ్స్ ఇచ్చారని, సీనియార్టీని పరిగణనలోకి తీసుకోకుండా అడ్డదారిలో ప్రమోషన్లు కల్పించారని ఆరోపించారు.
రొటేషనల్ రూల్స్ పాటించకుండా అడ్డగోలుగా ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి ఆరోపణలు రుజువు అయితే కచ్చితం పదోన్నతులను రద్దు చేయాలని కోరారు.