ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాక్ ఇది. తనదైన శైలిలో హడావుడి చేయాలని భావించిన పచ్చ పార్టీ అధ్యక్షుడికి మైండ్ బ్లాంకయ్యే తీర్పు వచ్చింది. 50 శాతం వీవీ ప్యాట్ల లెక్కింపు వ్యవహారంలో టీడీపీసహా 21 పార్టీలు వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ను ఇవాళ విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. విపక్షాల వాదనలు వినేందుకు నిరాకరించింది.
ప్రతి నియోజకవర్గం నుంచి కేవలం అయిదు వీవీప్యాట్ స్లిప్లను మాత్రమే ఈవీఎంలతో లెక్కింపు చేయాలని ఏప్రిల్ 8వ తేదీన సుప్రీం తీర్పునిచ్చింది. అయితే, యాభై శాతం వీవీప్యాట్ స్లిప్లను లెక్కించాలని 21 పార్టీలు వేసిన ఆ పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది. గతంలో ఇచ్చిన తీర్పును మార్చాలన్న ఉద్దేశం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. సుప్రీం మాత్రం తన పాత తీర్పుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.
కాగా, ఏపీ సీఎం చంద్రబాబు విపక్షాల తరపున ఇవాళ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. కేసు విచారణ సమయంలో ఆయన కోర్టులోనే ఉన్నారు. విచారణ నేపథ్యంలో బీజేపీయేతర పక్షాల నేతలు ఇవాళ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. కాగా, వీవీప్యాట్లో ఏదైనా మిషన్ సరిగా పనిచేయకుంటే దానికి బదులుగా ఏం చేయాలన్న దానిపై కోర్టు స్పష్టతనివ్వలేదని లాయర్ అభిషేక్ సింఘ్వీ తెలిపారు.