తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇలా పరస్పరం విమర్శలు చేసుకుంటున్న తరుణంలో తాజాగా మాజీ
మంత్రి, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఒక్క పేదవాడికి ఇళ్లు కట్టించిన పాపాన పోలేదని అన్నారు. ఇంటర్ పేపర్లనే సరిగా దిద్దలేనోడు ఢిల్లీలో చక్రం తిప్పుతాడటా అని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే
భాస్కర్ రావుపై సైతం కోమటిరెడ్డి మండిపడ్డారు.
భాస్కర్ రావు బచ్చా.. మా టార్గెట్ కేసీఆర్ అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. భాస్కర్రావు తన సొంతూరు గుంటూరుకు పారిపోయే రోజులు దగ్గరపడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా వ్యతిరేకతకు ఎమ్మెల్యే పారిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. భువనగిరి నుంచి రెండు లక్షల మెజార్టీతో గెలవబోతున్నానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి
వెంకట్ రెడ్డి అన్నారు.