ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో తెలుగు రాష్ర్టాల రాజకీయాలపై ఘాటుగా స్పందించారు. ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై ఘాటు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. తనతో పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కలిసిపోవాలని పాల్ హితవు పలికారు.
కేటీఆర్ తన గురించి చేసిన వ్యాఖ్యలను కేఏ పాల్ ప్రస్తావిస్తూ “కేటీఆర్కు పిచ్చి
పట్టింది. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. ఆయనకు డబ్బు, అహంకారం ఎక్కువైంది. కేటీఆర్కు డబ్బులు ఎక్కువైతే...కాంగ్రెస్ పార్టీ, కోదండరాంతో పెట్టుకోవాలి. నేను ప్రపంచాన్నే జయించాను. కేఏ పాల్ తో పెట్టుకోవద్దు. నేను కృష్ణమాదిగను కాను. 2008లో కేసీఆర్ నా దగ్గరకు వస్తే ఆశీర్వదించాను. మొదట తెలంగాణకు మద్దతు ఇచ్చింది నేను. కేసీఆర్ కు ఫండింగ్ కూడా చేశాను.`` అంటూ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ``ఇంటర్ ఫలితాల కారణంగా...తెలంగాణలో 23 కుటుంబాలు ఏడుస్తున్నాయి.
కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోతారా? నేను శాపం పెడితే నాశనం అయిపోతారు. కేటీఆర్ చిన జీయర్ స్వామి కాళ్ళు పట్టుకున్నా.. ఆయన కూడా కాపాడలేడు. కేసీఆర్ ను పూజారులు కూడా కాపాడలేరు. గొడవలొద్దు.. కేసీఆర్, కేటీఆర్ శాంతి మార్గంలో నాతో కలసి రావాలి. అమెరికా అధ్యక్షుడిని హైద్రాబాద్ తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేద్దాం. నాకు ఒక్క లెటర్ ఇవ్వండి అమెరికా ప్రెసిడెంట్ ను హైద్రాబాద్ తీసుకొస్తాను.`` అని పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23న ఏపీ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని కేఏ పాల్ అన్నారు. ``ఈ నెల 23 తర్వాత ఏపీ ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది నేనే. నేను కేసీఆర్, జగన్ కు శత్రువును కాదు” అని కేఏ పాల్ అన్నారు. సిగ్గులేని ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్ లో చేరుతున్నారని పాల్ మండిపడ్డారు.