బొత్స సత్యనారాయణ. సీనియర్ రాజకీయ నాయకుడు. ప్రత్యేకంగా చెప్పాలంటే.. ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసించి న నేతగా కూడా గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా, మంత్రిగా, అనేక పదవులు అలంకరించారు. తన కంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. విజయనగరం జిల్లా చీపురు పల్లి నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బొత్స.. తన కుటుంబాన్ని కూడా రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. ఇక, ఆయన ప్రాతినిధ్యం వహించిన చీపురుపల్లి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వారికి చెందిన పార్టీ అధికారంలోకి వస్తుండడం గమనార్హం. దీంతో చీపురుపల్లి విషయంలో పొలిటికల్గా సెంటిమెంట్ ఏర్పడడం విశేషం.
నియోజకవర్గం ఏర్పాటు నుంచి కూడా ఇక్కడ గెలిచిన అభ్యర్థి తాలూకు పార్టీ అధికారంలోకి వస్తోంది. ముఖ్యంగా టీడీపీ స్థాపించిన తర్వాత ఇక్కడ జరిగిన ఎన్నికలకు ప్రాధాన్యం పెరిగింది. 1983,1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఇక్కడ నుం చి విజయం సాధించారు. ఆ రెండు ఎన్నికల్లోనూ వరుసగా టీడీపీ అదికారంలోకి రావడం గమనార్హం. ఇక, 1989లో మా త్రం పరిస్థితి యూటర్న్ తీసుకుంది. ఇక్కడ నుంచిటీడీపీ అభ్యర్థి గెలిచినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఒక్క సారి మినహాయిస్తే.. ఈ నియోజకవర్గంలో సెంటిమెంట్కే పెద్ద పీట పడుతోంది. 1994, 1999 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీ పీ అభ్యర్థిగా గద్దె బాబూరావు విజయం సాధించారు.
ఇక, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 2004,2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ విజయం సాధించారు. ఈ రెండు ఎన్నికల్లోనూ వరుసగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరడం గమనార్హం. అంతేకాదు, బొత్స మంత్రిగా కూడా చక్రం తిప్పారు. ఇక, గత 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిమిడి మృణాళిని విజయం సాధించారు. అదే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో మృణాళినికి మంత్రి పదవి కూడా దక్కడం విశేషం. ఇక, ఇప్పుడు ఎన్నికలపై అందరి దృష్టీ పడింది. ఈ దఫా ఎన్నికల్లో చీపురుపల్లి నియజకవర్గంలో మృణాళిని కుమారుడు రంగ ప్రవేశ చేశారు.
ఇక, వైసీపీ నుంచి బొత్స పోటీకి దిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ యేతర పార్టీ నుంచి బొత్స పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అటు యువ కిశోరం, ఇటు సీనియర్ దిగ్గజం, ఆ పై భారీ సెంటిమెంట్ ఈ నేపథ్యంలో బొత్స ఇక్కడ నుంచి గెలుస్తారా? వైసీపీ ప్రభుత్వ ఏర్పడుతుందా? ఇక్కడ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.