గడువు! ఈ విషయం అందరికీ తెలిసిందే. అదే ఏ ఎంసెట్టో రాసే విద్యార్థులకైతే.. ఒక్క నిమిషం గడువు మరింత బాగా తె లుస్తుంది. సాధారణంగా గడువును పెంచడం.. రద్దు చేయడం అనేది మనం వింటూ ఉంటాం కూడా! అయితే, కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం గడువు.. గొడవకు దారి తీసి.. మరింత పీటముడిగా మారుతూ ఉంటుంది. ఇలాంటి గడువే.. ఇప్పుడు ఏపీలో మంత్రి గారికి ముచ్చెమటలు పట్టిస్తోంది. గడువు అనే మాట వింటే ఆయన ఒకింత ఇబ్బంది పడుతు న్నారని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఏం జరిగింది? అనే చర్చ జోరుగానే సాగుతోంది. అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు.. 2014లో వైసీపీ తరఫున విజయంసాధించారు.
అయితే, ఆయన తర్వాత కాలంలో టీడీపీ చెంతకు చేరిపోయారు. ఈ క్రమంలోనే మైనింగ్ కోసమే పార్టీ మారాడని, కోట్లు తీసుకున్నారని ఆరోపిస్తూ. మావోయిస్టులు పట్టపగలే ఆయనను చంపారు. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు కిడారి శ్రావణ్కుమార్ను చంద్రబాబు మంత్రిని చేశారు. అప్పటికి సివిల్ సర్వీసుల కోసం ఢిల్లీలో ప్రిపేర్ అవుతున్న శ్రావణ్.. ను ఒక్కసారిగా రాజకీయాల్లోకి తీసుకు వచ్చి.. మంత్రిని చేశారు. అయితే, నిబంధనల మేరకు ఆరుమాసాల్లో సదరు మంత్రిగా ఉన్న నాయకుడు అటు మండలి లేదా ఇటు శాసన సభ నుంచి ఎన్నిక కావాల్సి ఉంది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు సమయం ఎలాగూ ఆరు మాసాలే ఉన్నందున నేరుగా ఆయనకు టికెట్ ఇచ్చేద్దామని భావించారు చంద్రబాబు.
ఈ క్రమంలోనే సరిగ్గా ఆరు మాసాల గడువు చూసుకుని.. మంత్రిగా కిడారికి పట్టం కట్టారు. అయితే, ఈ గడువు కాస్తా..రివర్స్ అయింది. అనుకున్న సమయానికి ఎన్నికల రిజల్ట్ రాలేదు. పైగా ఈ గడువు మరింత ఎక్కువగా ఉండడంతో ఈ నెల 10 నాటికి కిడారి మంత్రి పదవి చేపట్టి ఆరు మాసాలు పూర్తవుతాయి. దీంతో ఇప్పుడు గడువు లేని నేపథ్యంలో ఇష్టం ఉన్నా లేక పోయినా.. మంత్రిగా తన పదవికి కిడారి శ్రావణ్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో అలెర్ట్ అయిన గవర్నర్ కార్యాలయం ఇప్పటికే ఓ నోట్ పంపింది. మరి దీనిపై చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఎన్నికల ఫలితాలు వెల్లడికి ఇంకా 15 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కిడారిని రాజీనామా చేయించాల్సి ఉంటుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.