తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. భారతదేశంలో బలమైన సమాఖ్య వ్యవస్థను కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. ఆర్థిక విషయాల్లో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. ఉమ్మడి జాబితాలో ఉన్న ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి వాటిని రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న సూచనకు పలు వర్గాల నుంచి ఎత్తున మద్దతు లభిస్తోంది. విద్య, ఉద్యోగాల్లో అర్హతగల పేదలకు రిజర్వేషన్ల కోటాను నిర్దేశించుకోవడంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని కేసీఆర్ అభిలాలషిస్తున్నారు. ఇలా రాష్ట్రాలను బలోపేతం చేయగలిగితే తత్ ఫలితంగా మొత్తం దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నది ఆయన నిశ్చిత సిద్ధాంతం.
అయితే, ఈ ప్రయత్నానికి ఊహించని మద్దతు దక్కింది. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీరప్పమొయిలీ కేసీఆర్ ఫ్రంట్ సరైనదేనని అన్నారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల్లో తప్పేమీలేదని చెప్పారు. హైదరాబాద్లో ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలకు నరేంద్రమోదీ ఉమ్మడి శత్రువుగా ఉన్నారని, ఆ పార్టీలు ఎన్డీయేతో చేతులు లుపబోవన్నారు. ప్రాంతీయ పార్టీలు ఎన్నికలకు ముందు కలువకపోయినా.. ఎన్నికల తర్వాత తమతో స్నేహపూర్వక వైఖరిని కొనసాగిస్తాయని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ నినాదంతో ముందుకు సాగుతున్న కేసీఆర్కు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత మద్దతు పలకడం ఆసక్తికరంగా మారింది. ఓ వైపు కేసీఆర్ ఫ్రంట్ పర్యటనల్లో ఉండగానే...మరోవైపు ఈ సానుకూల కామెంట్లు రావడం గమనార్హం.