జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రాజోలి శివారులో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. పట్టపగలు రోడ్డుపై ప్రధాన రహదారిలో ఈఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ తల్లిని.. ఆమె ప్రియుడిని కుమారుడే దారుణంగా హత్య చేశాడు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల్ గ్రామానికి చెందిన బడేసాబ్, సిబెలగల్ మండలానికి చెందిన శంకరమ్మ బంధువులు.
అయితే ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉండేది. శంకరమ్మ భర్త మరణించినప్పటికీ బడేసాబ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయంలో పద్ధతి మార్చుకోవాలని ఆమె కుమారుడు రాముడు చాలాసార్లు చెప్పాడు. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. ఈ వ్యవహరంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉండేది. కొన్ని రోజుల క్రితం రాముడి భార్య తన పుట్టినిల్లు అయిన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకలకు వెళ్లిపోయింది.
విషయం తెలిసి శంకరమ్మ, బడేసాబ్ కలిసి కొంకలకు వెళ్లి కోడలితో గొడవ పడ్డారు. అనంతరం శాంతినగర్ నుంచి రాజోలికి ఆటోలో బయలుదేరారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న రాముడు ఆగ్రహంతో బైక్ పై వెళ్లాడు. రోడ్డుపై వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో రాజోలి శివారులోకి రాగానే వారు ఎదురుపడ్డారు. దీంతో రాముడు ఆటోలో నుంచి ఇద్దరినీ కిందకు దించాడు. అంతే ఇక ఒక్కసారిగా వారిపై అటాక్ చేశాడు.
గొంతు, తలపై తీవ్రంగా నరకడంతో అక్కడికక్కడే వారిద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు హత్య జరిగిన చోటుకు చేరుకున్నారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలియలేదు. దీంతో మృతదేమాల వద్ద లభించిన మొబైల్ నెంబర్ల తో వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బడేసాబ్ కుమారుడు గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే రాముడు కర్నూలు జిల్లా సి.బెలగల్ ఠాణా పోలీసులకు లొంగిపోయాడు. వివాహేత సంబంధం పెట్టుకోవడంతోనే హతమార్చినట్లు ఒప్పుకున్నాడు.