తాజాగా ఇపుడిదే అంశంపై
రాజకీయాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. రేపటి కౌంటింగ్ తర్వాత చంద్రబాబునాయుడుకు కాంగ్రెస్ పార్టీ
చీఫ్ రాహూల్ గాంధి పెద్ద షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో
తెలుగుదేశంపార్టీ గెలవటం కష్టమనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాబోయే సిఎం
జగన్మోహన్ రెడ్డే అంటూ ప్రచారం ఊపందుకుంటున్న నేపధ్యంలో రాహూల్ దృష్టి జగన్ పై పడిందని చర్చలు
మొదలయ్యాయి.
రెండు రోజుల క్రితం తెలంగాణా కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి మాట్లాడుతూ ఫలితాల తర్వాత జగన్, కాంగ్రెస్ కలవటం ఖాయమన్నట్లే చెప్పారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలోకి రావటానికి కావల్సిన సంఖ్యాబలం ఎన్డీఏకి వస్తుందన్న నమ్మకం తగ్గిపోతోంది. అదే సమయంలో యూపిఏ బ్రహ్మాండంగా పుంజుకుంటుందన్న నమ్మకం కూడా పెద్దగా కనబడటం లేదు.
ఒకవేళ అధికారం అందుకోవటానికి రెండు కూటములకు ఓ 50, 60 సీట్లు అవసరమైతే అప్పుడు వాటి దృష్టి ముందుగా కచ్చితంగా కెసియార్, జగన్ లాంటి వాళ్ళపై పడుతుందనటంలో సందేహం లేదు. అటువంటి పరిస్ధితుల్లో జగన్ మద్దతు కోసం రాహూల్ గాంధి తప్పక ప్రయత్నిస్తారు. అందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, చిదంబరం, వీరప్పమొయిలీ లాంటి వాళ్ళు రాహూల్ దూతలుగా జగన్ తో మంతనాలు జరపవచ్చు.
ఇక జగన్ విషయం చూస్తే ప్రత్యేకహోదా ఎవరైతే ఇస్తారో వారికే తమ మద్దతుంటుందని ఎప్పుడో ప్రకటించారు. యూపిఏ అధికారంలోకి వస్తే ఏపికి హోదా ఇస్తామని రాహూల్ గతంలోనే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. హోదా విషయంలో నరేంద్రమోడి స్టాండ్ ఏమిటో ఇంత వరకూ ఎవరికీ తెలీదు. అధికారంలోకి రావటానికి పై రెండు కూటముల్లో జగన్ కు వచ్చే ఎంపి సీట్లు అవసరమైతే జగన్ యూపిఏ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువుంది.
నిజంగా అదే గనుక జరిగితే మరి చంద్రబాబు పరిస్ధితేంటి ? ఏముంది పక్కకు వెళ్ళిపోవటం తప్ప చంద్రబాబు చేయగలిగింది కూడా ఏమీ లేదు. 25 ఎంపి సీట్లలో జగన్ కు ఓ 20 సీట్లొస్తే రాహూల్ కూడా జగన్ ను కాదని చంద్రబాబును ఎందుకు పక్కన పెట్టుకుంటారు ? చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపింది అవసరం కోసమే. అదే అవసరం రాహూల్, జగన్ ను కూడా కలుపుతుందంతే. బహుశా అందుకేనేమో జగ్గారెడ్డి పై స్టేట్మెంట్ ఇచ్చింది.