టీవీ9 వివాదం మలుపులు తిరుగుతోంది. కంపెనీలో 91 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్ అడ్డుతగులుతున్నారని ఆయనపై ప్రధానంగా ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. రవివి ప్రకాష్తో పాటు హీరో శివాజీపై అలందా మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72 కింద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ9ను కొనుగోలు చేసిన అలందా మీడియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు.
అయితే, దీనిపై రవిప్రకాష్ వివరణ ఇచ్చారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరూ అరెస్ట్ చేయడం లేదని స్పష్టంచేశారు. ఎన్సీఎల్టీ కేసు కోర్టులో ఉందని..మే 16 విచారణ జరగుతుందని ఆయన చెప్పారు. దాని ఆధారంగా తనపై తప్పుడు కేసులు బనాయించేందుకు కొందరు కుట్రలు చేశారని..అవన్నీ నిలబడబోవని తెలిపారు. టీవీ 9 వాటాల అమ్మకం, యాజమాన్యం మార్పిడికి సంబంధించి కొన్నిరోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వివాదానికి శుక్రవారం బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది.
ఇటు రవిప్రకాష్, అటు టీవీ9 భవిష్యత్ శుక్రవారం తేలనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు టీవీ9 డైరెక్టర్ల మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలో సీఈఓ నియామకంపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగానే సీఈఓ హోదాలో ఎవరుండాలనే అంశంపై డైరెక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు.