సహజంగా సౌమ్యంగా వ్యవహరించే, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండే కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి పరిణామాలను ఉదహరిస్తూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఎంపీ బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతల దేశవ్యాప్త టూర్లపై మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. ఫెడరల్ ఫ్రంట్, మహా కూటములు తమ దరిదాపుల్లో కూడా లేవన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటోడు.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం తాగునీటి ప్రాజెక్టుల విషయంలో వాగ్దానాలకే పరిమితం అయిందని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సర్కార్, సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని దుయ్యబట్టారు. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని 39 వేల కోట్ల నుంచి రూ.52 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. అలాగే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకి పెంచి, దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మండిపడ్డారు.
ఇంటర్మీడియట్ బోర్డు అలసత్వం కారణంగా 23 మంది విద్యార్థులు బలయ్యారని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు సభ్యుల కమిటీ రిపోర్టు ఇచ్చినా కూడా గ్లోబరినా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఇంటర్బోర్డు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.