ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌పై నెల‌కొన్న ఆగ్ర‌హావేశాలు, ఆందోళ‌న‌లు ఇంకా కొన‌సాగుతున్నాయి. ఇంట‌ర్ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున ఆందోళ‌న చేసిన‌ వారిలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ ఒక‌రు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు. విద్యార్థులకు పూర్తి న్యాయం చేయాలన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన నిరవదిక నిరాహార దీక్ష చేపట్టారు. అనంత‌రం ఆయ‌న నిమ్స్‌లోనూ ఆయ‌న బ‌లవంతంగా దీక్ష చేప‌ట్టారు. 


తాజాగా ఓ స‌మావేశంలో ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగానే ఇంటర్ విద్యార్థులు చనిపోయారని ఆరోపించారు. యువకుల బలిదానాలపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ విద్యార్థులే బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ రిజల్ట్ ను వారి పెంపుడు కుక్కలకు కాంట్రాక్టుగా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్త‌ర‌ఫ్ చేయాలని, ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు. గ్లోబరీనా సంస్థ అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం..ఓ కుటుంబం గుప్పిట్లో నలిగిపోతుందని ల‌క్ష్మ‌ణ్‌ విమర్శించారు. రాజకీయాలను డబ్బు శాసిస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. డబ్బును అక్రమంగా సంపాదించిన వ్యాపార, పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసే వారిని ప్రజలు ఆదరిస్తున్నప్పటికి…చివరి నిమిషంలో డబ్బు ప్రధాన పాత్ర పోషించడంతో ఓడిపోతున్నారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: